నగోయా: ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సంబురం, భారత క్రీడాకారులు స్వర్ణకాంతులు.. వెండి వెలుగులు.. కంచు మోతలు మోగించే మెగా క్రీడోత్సవం రానే వచ్చింది. 20వ ఎడిషన్ ఆసియా గేమ్స్కు జపాన్లోని పారిశ్రామిక నగరం నగోయా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శనివారం అట్టహాసంగా జరిగే ప్రారంభోత్సవంతో మెగా గేమ్స్ హంగామా అధికారికంగా షురూ కానుంది. ఒలింపిక్స్ కంటే ఎక్కువ క్రీడలు (43 విభాగాల్లో) ఉన్న ఆసియాడ్లో 45 దేశాల నుంచి దాదాపు 11 వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. 2022 హాంగ్జౌ ఆసియాడ్లో నాలుగో స్థానంలో నిలిచి సాధించిన చారిత్రాత్మక 106 పతకాల రికార్డును తిరగరాయాలనే పట్టుదలతో భారత్ ఈసారి 501 మంది అథ్లెట్లతో కూడిన భారీ బృందాన్ని 37 ఆటల్లో బరిలోకి దింపుతోంది.
2036 నాటికి ప్రపంచ టాప్-10 క్రీడా దేశాల్లో ఒకటిగా, 2047 నాటికి టాప్-5లో నిలవాలనే భారత్ సుదీర్ఘ లక్ష్యానికి ఈ ఆసియా క్రీడోత్సవం ఒక కీలకమైన పరీక్షగా నిలవనుంది. ఎన్నో ఆశలతో నగోయా చేరుకున్న భారత అథ్లెట్లు ఇరుకైన గదులు, పోటీలకు సుదూర ప్రాంతాల్లోని అరకొర వసతులతో ఎదురైన ఇబ్బందులను పక్కనబెట్టి తమ దృష్టిని మైదానంలో ప్రదర్శనపై కేంద్రీకరించారు. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
భారత పతకాల వేటలో అథ్లెటిక్స్, షూటింగ్ విభాగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. వరుసగా రెండుసార్లు పసిడి నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా దూరమైనప్పటికీ 74 మందితో కూడిన భారత అథ్లెటిక్స్ దళం కొండంత ఆశలతో ఉంది. షాట్పుట్లో తజిందర్పాల్ సింగ్ తూర్ హ్యాట్రిక్ స్వర్ణం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), గుల్వీర్ సింగ్ (డిస్టెన్స్ రన్), రోహిత్ యాదవ్ (జావెలిన్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), యర్రాజి జ్యోతి (100 మీటర్ల హర్డిల్స్), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్) పసిడి రేసులో ముందున్నారు.
గత ఎడిషన్లో 6 గోల్డ్ సహా 29 మెడల్స్ సాధించిన అథ్లెటిక్స్ విభాగం నుంచి భారత్ మరోసారి ఆ స్థాయి ప్రదర్శన ఆశిస్తోంది. ఇక, షూటింగ్లో ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్, గత ఆసియాడ్లో స్వర్ణం, మూడు రజతాలు నెగ్గిన తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. వీళ్ల నేతృత్వంలోని 30 మంది షూటర్లు పతకాలపై గురి పెట్టారు. అంతర్జాతీయ షూటింగ్ ఈవెంట్లలో అదరగొడుతున్న భారత్కు ఈ మెగా గేమ్స్లో చైనా షూటర్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేయనున్న టీ20 క్రికెట్కు ఈ మెగా గేమ్స్ను భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు టీజర్గా భావిస్తూ స్వర్ణాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక హాకీలో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల జట్టు పసిడి పతకంతో పాటు 2028 ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. మహిళల హాకీ జట్టు గత ఎడిషన్లో వచ్చిన వెండి పతకాన్ని ఈసారి బంగారంగా మార్చాలని చూస్తోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ జోడీ స్వర్ణంపై గురి పెట్టగా..మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు దేశానికి పతకం అందించేందుకు సిద్ధమైంది. బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ పోటీల్లోనూ భారత జట్లు స్వర్ణాల వేటలో ముందున్నాయి.
ఆసియా గేమ్స్ ప్రారంభోత్సవంలో స్టార్ షూటర్ మను భాకర్, అథ్లెట్ తజిందర్ సింగ్ పాల్ భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు. నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేడుకలు మొదలవుతాయి.

ఆసియా క్రీడల్లో కొత్త ఆట టెక్బాల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న యువ టెకర్ క్విమ్సీ డిసౌజా చారిత్రాత్మక పతకానికి విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్లో బరిలోకి దిగిన 24 ఏండ్ల ఈ ముంబై అమ్మాయి.. తన రెండు గ్రూప్ దశ మ్యాచ్లనూ గెలుచుకుని సెమీస్ చేరింది. క్వార్టర్స్లో బై రావడంతో ఆమె నేరుగా సెమీస్కు ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్లో మహ్మద్ అనాస్ బేగ్తో జతకట్టిన డిసౌజా.. క్వార్టర్స్లో వియత్నాం చేతిలో ఓడినా రెపిచేజ్ రౌండ్లో 2-0తో ఫిలిప్పీన్స్పై గెలిచి కాంస్య పతక రేసులో నిలిచింది.