బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న భారత ఫుట్బాల్ జట్టు.. తొమ్మిదోసారి దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (సాఫ్) టైటిల్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. టోర్నీ ఆసాంతం ఓటమి ఎరుగకుండా సత్తాచాటిన భారత్ మంగళవారం జరుగనున్న ఫైనల్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్లో లెబనాన్పై షూటౌట్లో ఛెత్రీసేన విజయం సాధించగా.. బంగ్లాదేశ్పై గెలుపుతో కువైట్ తుదిపోరుకు చేరింది.
గ్రూప్ దశలో కువైట్తో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేయాలని చూస్తున్నది. స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీతో పాటు అబ్దుల్ సమద్, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్.. గోల్ కీపర్ గుర్ప్రీత్సింగ్ సంధు ఈ మ్యాచ్లో కీలకం కానున్నారు. వీరంతా సమిష్టిగా సత్తాచాటితే భారత్ ఖాతాలో మరో టైటిల్ చేరడం ఖాయమే.