విరాట్ కోహ్లీ లేడు.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించలేదు!
పుజారా, రహానే ఊసే లేదు.. శ్రేయస్ లయ కోల్పోయాడు!!
గాయపడ్డ షమీని ఎంపికే చేయలేదు.. బుమ్రాకు విశ్రాంతినిచ్చారు!!!
అయినా.. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫరాజ్ అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లో అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురెల్ కూడా మంచి జోరు మీదుండగా.. గిల్ గాడినపడ్డాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్సేన.. రాంచీలోనే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. సమం చేయాలని ఇంగ్లండ్ టీమ్ తహతహలాడుతున్నది. మరి ధోనీ సొంత ఇలాకాలో ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి!
Ind Vs Eng Test | రాంచీ: ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత బలహీన పేస్ బౌలింగ్ విభాగంతో భారత జట్టు టెస్టు మ్యాచ్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా.. షమీకి గాయం, బుమ్రాకు విశ్రాంతి కారణంగా సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనుండగా.. కొత్త కుర్రాడు ఆకాశ్ దీప్ అరంగేట్రం చేసే చాన్స్ ఉంది. మరోవైపు ‘బజ్బాల్’ ఆట తీరు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్ కోల్పోని ఇంగ్లండ్కు రాంచీలో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ దూకుడే మంత్రంగా చెలరేగిన ఇంగ్లిష్ జట్టు రాంచీ పిచ్ను చూసే తెగ తికమక పడుతున్నది. ఇక బరిలోకి దిగిన తర్వాత ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది చూడాలి. కోహ్లీ, రాహుల్, శ్రేయస్ వంటి వాళ్లు అందుబాటులో లేకున్నా.. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు డబుల్ సెంచరీలతో 545 పరుగులు చేసి ఫుల్ జోష్ మీదుండగా.. సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్ టచ్లో ఉన్నారు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు పెద్దన్నగా వ్యవహరిస్తుండగా.. అవసరమైతే బ్యాట్తోనూ సత్తాచాటేందుకు తాను సిద్ధమే అని జడేజా నిరూపిస్తున్నాడు. గత మూడు మ్యాచ్లకు భిన్నమైన పిచ్ రాంచీలో ఎదురుచూస్తుండగా.. టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. బుమ్రా స్థానాన్ని ఆకాశ్దీప్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఇంగ్లండ్.. తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మార్క్వుడ్ స్థానంలో ఒలీ రాబిన్సన్ను, రెహాన్ అహ్మద్ ప్లేస్లో షోయబ్ బషీర్కు చోటు కల్పించింది. బుమ్రా గైర్హాజరీతో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఊపిరి పీల్చుకుంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అతడి బౌలింగ్లో పదే పదే ఔట్ అవుతున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్లో సత్తాచాటుతాడా చూడాలి.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, రూట్, బెయిర్స్టో, బషీర్, ఫోక్స్, హర్ట్లీ, పోప్, రాబిన్సన్, అండర్సన్. భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, ధ్రువ్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ముఖేశ్/అకాశ్దీప్.
గత మూడు మ్యాచ్లు జరిగిన వేదికలతో పోల్చుకుంటే.. రాంచీ పిచ్ భిన్నంగా ఉండనుంది. స్పిన్కు సహకరించే అవకాశలెక్కువ. పిచ్పై పగుళ్లు ఉన్నాయి. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు.
టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్కు ఇంకా నాలుగు వికెట్లు కావాలి. మురళీధరన్ (800), వార్న్(708) ముందువరుసలో ఉన్నారు.