ఐపీఎల్లో బంతితో నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఉమ్రాన్ నెట్స్లో చెమటోడుస్తున్నాడు. బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే నేతృత్వంలో ఉమ్రాన్.. వేగంతో పాటు కచ్చితత్వంపై దృష్టిపెడితే.. తన యార్కర్లతో హడలెత్తించిన అర్శ్దీప్ సింగ్.. బ్లాక్హోల్ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో సిరీస్ ప్రారంభం కానుండగా.. హెడ్ కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమ్ఇండియా శిక్షణలో నిమగ్నమైంది. రాహుల్, పంత్, కార్తీక్ తమ బ్యాట్లకు పదును పెంచే పనిలోపడ్డారు!
న్యూఢిల్లీ: తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికైన యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్శ్దీప్ సింగ్ నెట్స్లో చెమటోడుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం ప్రారంభం కానుండగా.. భారత జట్టు సోమవారం నెట్ ప్రాక్టీస్లో పాల్గొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పర్యవేక్షణలో ఆటగాళ్లు శిక్షణ కొనసాగించారు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు సఫారీలతో సిరీస్కు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగుతున్నది. ఐపీఎల్ అనంతరం తిరిగి ఆటగాళ్లంతా జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా కనిపిస్తుండగా.. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ నెట్స్లో భారీ షాట్లు కొట్టడంపై దృష్టి పెట్టారు. ఈ సిరీస్లో బౌలింగ్ దళానికి భువనేశ్వర్ కుమార్ నేతృత్వం వహించనుండగా.. అతడితో పాటు హర్శల్ పటేల్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, అర్శ్దీప్ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. తొలి ప్రాక్టీస్ సెషన్లో ఉమ్రాన్ వేగం మీద దృష్టి పెడితే.. అర్శ్దీప్ యార్కర్లను మరింత సమర్థవంతంగా ఎలా సంధించాలో సాధన చేశాడు.
కార్తీక్ ల్యాప్ స్కూప్..
సాధారణంగా ఇతర పేసర్లకు భిన్నంగా అర్శ్దీప్ సుదీర్ఘంగా నెట్స్లో బంతులిసురుతూ కనిపించాడు. ఫిట్నెస్ సాధన అనంతరం భువనేశ్వర్ కాసేపు మాత్రమే బౌలింగ్ చేయగా.. ఉమ్రాన్ వేగాన్ని రిషబ్ పరీక్షించాడు. జమ్ము ఎక్స్ప్రెస్ వాయువేగంతో వేసిన బంతులను పంత్ అంతే వేగంతో బౌండ్రీలకు పంపాడు. బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే సమక్షంలో అర్శ్దీప్ బ్లాక్హోల్ బంతులు సంధిస్తే.. లేటు వయసులో రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ‘ల్యాప్ స్కూప్’షాట్లు ప్రాక్టీస్ చేశాడు. థ్రో డౌన్ స్పెషలిస్ట్లు నువాన్, దయా, రఘుతో బంతులు వేయించుకుంటూ.. ల్యాప్ స్కూప్, రివర్స్ ల్యాప్ స్కూప్ ఆడేందుకు ప్రయత్నించాడు. 36 ఏండ్ల వయసులో జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. దేశానికి ప్రపంచకప్ అందిచడమే తన లక్ష్యమని పేర్కొనగా.. వైస్ కెప్టెన్ పంత్ను కాదని అతడికి కీపర్గా తుది జట్టులో చోటు కల్పిస్తారా.. లేక స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.