న్యూఢిల్లీ: రెజ్లింగ్ అడ్హాక్ కమిటీని భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఐవోఏ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సెలెక్షన్ ట్రయల్స్ను అడ్హాక్ కమిటీ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఐవోఏ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఐవోఏ ఈ చర్యలకు పూనుకుంది.
ఇదిలా ఉంటే అడ్హాక్ కమిటీని రద్దు చేసిన ఐవోఏకు ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇక నుంచి పూర్తి స్థాయిలో డబ్ల్యూఎఫ్ఐ విధులు నిర్వర్తిస్తున్నది. దేశంలోని రెజ్లర్లందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. త్వరలో జాతీయ క్యాంప్ ఏర్పాటు చేసి రెజ్లర్లకు శిక్షణ అందిస్తాం. ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళుతున్నాం. పారిస్ ఒలింపిక్స్కు ఐదు లేదా ఆరుగురు రెజ్లర్లు అర్హత సాధించే అవకాశముంది’ అని సంజయ్ అన్నాడు.