హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలవనుంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) శ్రీకారం చుట్టిన టీజీ20 లీగ్ జూన్ 20న మొదలవనుంది. టోర్నీలో పాల్గొనే ఎనిమిది వ్యవస్థాపక ఫ్రాంచైజీలను హెచ్సీఏ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 3 కోట్ల ప్రారంభ ధరతో మొదలైన బిడ్డింగ్ ప్రక్రియలో అత్యధికంగా రూ. 7.50 కోట్లు బిడ్ చేసిన ఉషోదయ సంస్థ హైదరాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్ఫ్రా/ప్రణవ సంస్థ రూ. 7.20 కోట్లకు, వరంగల్ టీమ్ను బైన్ గ్లోబల్ రీసోర్సెస్ రూ. 6.55 కోట్లకు, మెదక్ను భృంద ఇన్ఫ్రా రూ. 6.33 కోట్లకు కొనుగోలు చేశాయి. నల్లగొండ ఫ్రాంచైజీని కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (రూ. 5.06 కోట్లు), కరీంనగర్ జట్టును ఈఐపీఎల్ గ్రూప్-తిబరుమాల్ (రూ. 4.57 కోట్లు) దక్కించుకోగా.. మహబూబ్నగర్ జట్టును వీరభద్ర స్టీల్స్ (రూ. 4.50 కోట్లు), ఖమ్మం ఫ్రాంచైజీని అన్విత గ్రూప్ (రూ. 4.44 కోట్లు) దక్కించుకున్నాయి.
ఈ 8 ఫ్రాంచైజీలను హెచ్సీఏ ఐదేళ్ల కాలానికి కేటాయించింది. ఆయా ఫ్రాంచైజీ ప్రతీ ఏటా బిడ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా తొలి ఏడాదే హెచ్సీఏ ఖజానాలో రూ. 46.15 కోట్లు చేరాయి. జూన్ 7న క్రికెటర్ల వేలం నిర్వహించి అదే నెల 20న లీగ్ ప్రారంభించాలని హెచ్సీఏ నిర్ణయించింది. జులై 11న ఫైనల్ షెడ్యూల్ చేసింది. టోర్నీ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్, జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శులు అమర్నాథ్, జీవన్రెడి, లీగ్జీసీ చైర్మన్ ఆగంరావు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి అధికారిక ఆహ్వానం అందకపోవడంపై పలువురు హెచ్సీఏ క్లబ్ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.