ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ మీద మోజు పెరుగుతున్నందున ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్ కు మరింత గడ్డుకాలం ఎదురుకానుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టుకు హాజరైన బార్క్లే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బార్క్లే మాట్లాడుతూ.. ‘వివిధ దేశాలలో ఫ్రాంచైజీ క్రికెట్, స్థానికంగా డొమెస్టిక్ లీగ్స్ పెరుగుతుండటం టెస్టు క్రికెట్ కు పెను ప్రమాదంగా మారింది. ఈ లీగ్ క్రికెట్ వల్ల ద్వైపాక్షిక సిరీస్ లకు ఆటంకం ఏర్పడుతున్నది. టీ20 క్రికెట్ విస్తృతి పెరుగుతుండటం వల్ల రెండు దేశాల మధ్య టెస్టులను ఆడించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది..’ అని అన్నారు.
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ఆర్థికంగా బలంగా ఉన్న బోర్డులు తప్ప మిగిలిన దేశాలు టెస్టులు ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని బార్క్లే తెలిపారు. న్యూజిలాండ్ వంటి దేశం కూడా టీ20 లకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నదని.. జీతాల చెల్లింపు, బోర్డుల నిర్వహణ కారణంగా ఆయా దేశాలు పొట్టి ఫార్మాట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయని బార్క్లే చెప్పుకొచ్చారు.
‘కొన్ని దేశాలు టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించడం లేదు. మరికొన్ని దేశాలేమో ఐసీసీ నిర్దేశించిన విధంగా టెస్టులు ఆడేందుకు సుముఖంగా లేవు. కానీ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం టెస్టు క్రికెట్ ఆడటంలో ఏ ఇబ్బందులూ ఎదుర్కోవడం లేదు..’ అని వివరించారు. రానున్న రోజుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ దే భవిష్యత్ అని.. అభిమానులు, బోర్డులు కూడా అవే కోరుకుంటున్నాయని బార్క్లే తెలిపారు.