Mahesh Bhupathi : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఆట పసికూనను తలపిస్తోంది. విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లున్నా.. ఆర్సీబీ అట్టడుగున నిలిచింది. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోతకు ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ బద్ధలైన వేళ.. సొంతమైదానంలో ఆర్సీబీ ఓటమి తప్పలేదు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవని బెంగళూరుపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి (Mahesh Bhupathi) సంచలన కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ జట్టును మరొక యజమానికి అమ్మేయాల్సిందిగా బీసీసీఐని భూపతి కోరాడు.
‘ఆటను, ఐపీఎల్ను బతికించేందుకు, కోట్లాది మంది ఫ్యాన్స్ నమ్మకాన్ని కాపాడేందుకు ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మడంలో బీసీసీఐ చొరవ చూపాలి. అప్పుడే మిగతా జట్ల మాదిరిగా బెంగళూరు పూర్తిగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీగా మారిపోతోంది’ అని భూపతి తన ఎక్స్ ఖాతా పోస్ట్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్లు యజమానిగా ఉన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తర్వాత 2016లో వీళ్లు బెంగళూరు జట్టును ఛేజిక్కించుకున్నారు.
For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic
— Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024
పదహారో సీజన్లో కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ మెరుపులతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ఆర్సీబీ ఈసారి చెత్త ఆటతో నిరాశపరుస్తోంది. పంజాబ్ కింగ్స్పై విజయం తప్పిస్తే.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో డూప్లెసిస్ సేన దారుణ పరాభవాలు చవిచూసింది. ఇక చిన్నస్వామిలో ప్రధాన ఆటగాళ్లు మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, సిరాజ్, అల్జారీ జోసెఫ్లు లేకుండా బరిలోకి దిగి భారీ మూల్యమే చెల్లించుకుంది.
ట్రావిస్ హెడ్(102), క్లాసెన్(69), అబ్దుల్ సమద్(37 నాటౌట్)ల వీరబాదుడుకు బెంగళూరు జట్టు 287 పరుగులు సమర్పించుకుంది. భారీ ఛేదనలో దినేశ్ కార్తిక్(83), డూప్లెసిస్(62), కోహ్లీ(42)లు దూకుడుగా ఆడినా సరిపోలేదు. దాంతో, హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.