వన్డేల్లో న్యూజిలాండ్ను ఊడ్చేసిన టీమ్ఇండియా.. ఇక పొట్టి పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రాంచీ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరుగనుంది. క్లీన్స్వీప్ల ఊపు కొనసాగించాలని భారత్ భావిస్తుంటే.. బదులు తీర్చుకోవాలని కివీస్ కాచుకుని ఉంది.పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ సొంతగడ్డపై చెలరేగాలని చూస్తుంటే.. శుభ్మన్ గిల్ వన్డే ఫామ్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి వన్డేల్లో వైట్వాష్కు గురైన న్యూజిలాండ్ ఇక్కడైనా పోటీనిస్తుందా చూడాలి!
రాంచీ: వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ను క్లీన్స్వీప్ చేసిన భారత్.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. వన్డేల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ చూస్తున్నది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినివ్వగా.. యువ భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్కు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. దీంతో పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యాతో పాటు యువ ఓపెనింగ్ జోడీ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కీలకం కానున్నారు. రంజీ ట్రోఫీలో మెరుపులు మెరిపించి చాన్నాళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ పృథ్వీ షాకు తుది జట్టులో చాన్స్ దక్కడం కష్టమే.
ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్కు కూడా సీనియర్లు గైర్హాజరు కాగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ఇండియా 2-1తో సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. గిల్, ఇషాన్ రూపంలో భారత్కు మెరుగైన ఓపెనింగ్ జోడీ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గిల్ సూపర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇటీవల వన్డే సిరీస్లో అతడు ఓ సెంచరీ, ఓ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇషాన్ తన వంతు కోసం ఎదురుచూస్తుండగా.. వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్లో దంచికొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను పరీక్షించాలనుకుంటున్న టీమ్ మేనేజ్మెంట్ గత కొంతకాలంగా అదే తీరు కొనసాగిస్తూ వస్తున్నది.
బ్యాటింగ్లో మెరుగైన ఆటగాళ్లున్నా.. బౌలింగ్లోనే భారత్కు కాస్త ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకున్న అర్ష్దీప్ సింగ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా.. అతడితో పాటు జమ్ము ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, అండర్-19 హీరో శివమ్ మావి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ ముగ్గురికీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోవడం న్యూజిలాండ్కు కలిసొస్తుందా చూడాలి. ఏకైక స్పిన్నర్గా కుల్దీప్, చాహల్లో ఒకరు జట్టులో చోటు దక్కించుకోనున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్, అర్ష్దీప్, కుల్దీప్/చాహల్.
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిషెల్, బ్రాస్వెల్, టిక్నర్, సోధి, లిస్టెర్, ఫెర్గూసన్.
పిచ్, వాతావరణం
రాంచీ వికెట్ బ్యాటింగ్కు సహకరించనుంది. రాత్రి తేమ ప్రభావం ఉండనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
రాంచీలో ఆడిన మూడు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. 2021 నవంబర్లో ఇక్కడ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది