బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు! లీగ్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లాడి కేవలం ఒక్క విజయం మాత్రమే ఖాతాలో వేసుకున్న టైటాన్స్.. మంగళవారం హర్యానా స్టీలర్స్తో జరిగిన పోరును 39-39తో ‘డ్రా’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కు ఇది మూడో ‘డ్రా’ కాగా.. పది పరాజయాలు మూటగట్టుకున్న మన జట్టు.. 22 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నది. హర్యానాతో పోరులో టైటాన్స్ తరఫున అంకిత్ (10), రోహిత్ కుమార్ (8), ఆదర్శ్ (6) రాణించినా ఫలితం లేకపోయింది. హర్యానా జట్టులో వికాస్ (10), రోహిత్ (8), వినయ్ (8) సత్తాచాటారు. బుధవారం జరుగనున్న మ్యాచ్లో యూ ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనుంది.
అట్టడుగున తెలుగు జట్టు
ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు బుల్స్ 46 పాయింట్లతో టాప్లో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ (43), హర్యానా స్టీలర్స్ (42) ఆ తర్వాత వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సీజన్ ఆరంభం నుంచే తడబడుతున్న తెలుగు టైటాన్స్ బోణీ కొట్టేందుకే పది మ్యాచ్లకు పైగా తీసుకోగా.. ఆ తర్వాత కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నది. పాలమూరు రైడర్ గల్ల రాజుకు సరైన అవకాశాలు లభించకపోగా.. ప్రధాన ఆటగాళ్లు రోహిత్ కుమార్, ఆకాశ్, సందీప్, ఆదర్శ్, సురిందర్ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నారు. అంకిత్ బెనివాల్ పోరాడుతున్నా.. మ్యాచ్లను గెలిపించడంలో మాత్రం విఫలమవుతున్నాడు.
కరోనా కలకలం
కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో కొనసాగుతున్న ఈ లీగ్లో కరోనా వైరస్ కలకలం రేపింది. టోర్నీలో ఇద్దరు ప్లేయర్లకు సోమవారం పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటికే ఖరారైన మ్యాచ్ల షెడ్యూల్లో మార్పులు జరిగాయి. జనవరి 25 నుంచి 30 వరకు జరుగాల్సిన మ్యాచ్ల్లో మార్పులు చేసినట్లు పీకేఎల్ నిర్వాహకులు మాషల్ స్పోర్ట్స్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పాజిటివ్ బారిన పడిన ఆటగాళ్లను ఎవరన్నది వెల్లడించలేదు.