న్యూఢిల్లీ: రెండు వారాల వ్యవధిలో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రెండోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. వంద మీటర్ల హర్డిల్స్లో తన రికార్డును తానే తుడిచేసి కొత్త గణాంకాలు నమోదు చేసింది. యూకే వేదికగా ఆదివారం జరిగిన లౌఫ్బరౌఫ్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో జ్యోతి 13.11 సెకండ్లలో రేసు పూర్తి చేసి జాతీయ రికార్డుతో పాటు.. టైటిల్ ఖాతాలో వేసుకుంది.
ఈనెల 10న సిప్రస్ మీట్లో జ్యోతి 13.23 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి.. అనురాధ బిశ్వాల్ (13.38 సెకండ్లు) 20 ఏండ్ల కిందటి రికార్డును చెరిపేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని రిలియన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేమ్స్ హిల్లియర్ నేతృత్వంలో శిక్షణ పొందుతున్న జ్యోతి రేసుగుర్రంలా పరుగులు పెడుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన అమ్లాన్ బొర్గోహై 200 మీటర్ల రేసును 21.27 సెకండ్లలో పూర్తి చేసి ఐదో స్థానంలో నిలువగా.. సిద్ధాంత్ 110 మీటర్ల హర్డిల్స్ను 13.97 సెకండ్లలో, గ్రేస్సన్ అమల్దాస్ 13.91 సెకండ్లలో పూర్తి చేశారు.