హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేవలం చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తాచాటుతామని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మరోమారు నిరూపించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా..జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారు. ఎంచుకున్న క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న జాతీయ జూడో చాంపియన్షిప్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు ప్రవీణ్, రంగా పతకాలతో మెరిశారు. బాలుర 30కిలోల సబ్జూనియర్ విభాగం ఫైనల్లో ప్రవీణ్..వేదాంత్(మహారాష్ట్ర) చేతిలో ఓటమి ఎదుర్కొని రజతం ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు బాలుర 50కిలోల విభాగంలో రంగా..కర్ణాటకకు చెందిన జూడో ప్లేయర్ శశాంక్పై గెలిచి కాంస్యం దక్కించుకున్నాడు. క్యాడెట్ విభాగంలో తెలంగాణకు ఇది తొలి పతకం కావడం విశేషం. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్రవీణ్, రంగాను గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో అభినందించారు.