భోపాల్: సప్త సముద్రాలీదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్లు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకున్న తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్.. జాతీయ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం 50 కేజీల మహిళల సెమీఫైనల్లో నిఖత్ 5-0తో శివందర్ కౌర్ (ఆల్ఇండియా పోలీస్)పై గెలుపొందింది.
పోరు ఆరంభం నుంచే వరుస పంచ్లతో విరుచుకుపడిన నిఖత్కు.. శివందర్ కనీస పోటీనివ్వలేకపోయింది. దీంతో ఏకపక్ష విజయం నమోదు చేసుకున్న ఈ తెలంగాణ అమ్మాయి.. సోమవారం జరుగనున్న తుదిపోరులో రైల్వేస్ బాక్సర్ అనామికతో తలపడనుంది. ఇతర బౌట్లలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (75 కేజీలు), ముంజురాణి (48 కేజీలు), జ్యోతి గులియా (52 కేజీలు) తమ తమ విభాగాల్లో ఫైనల్కు చేరుకున్నారు.