హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యార్థి అగసర నందిని మరోమారు సత్తాచాటింది. కొలంబియా వేదికగా ఆగస్టు 1నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీ కోసం భారత జట్టు శిక్షణా శిబిరానికి ఎంపికైంది.
ఇటీవల గుజరాత్లో జరిగిన 20వ జాతీయ ఫెడరేషన్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆకట్టుకుని.. కొలంబియాలో జరిగే మెగాటోర్నీకి నందిని అర్హత సాధించింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ క్యాంప్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 45 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి నందిని ఏకైక బెర్తు దక్కించుకుంది. మరోవైపు 400మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కుంజా రజిత ఎంపికైనట్లు జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ పేర్కొన్నాడు.