జమ్ము: జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అదరగొట్టింది. వేర్వేరు విభాగాల్లో మూడు స్వర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు ఖాతాలో వేసుకొని అదుర్స్ అనిపించింది. జమ్ము వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సోమవారం డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన శ్రీజ 4-2 (9-11, 14-12, 11-7, 13-11, 6-11, 12-10)తో పశ్చిమబెంగాల్కు చెందిన సుతీర్థ ముఖర్జీపై విజయం సాధించింది.
ఈ విజయంతో శ్రీజకు రూ.2.75 లక్షల నగదు పురస్కారం లభించింది. ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన శ్రీజ సింగిల్స్లో స్వర్ణం సాధించడంతో పాటు.. మహిళల డబుల్స్లోనూ బంగారు పతకం చేజిక్కించుకుంది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ-దియా జంట 3-1తో స్వాస్తిక-శృతి జోడీపై గెలుపొందింది. టీమ్ విభాగంలోనూ స్వర్ణం చేజిక్కించుకున్న శ్రీజ.. మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కైవసం చేసుకుంది. అద్వితీయ ప్రదర్శన కనబర్చిన శ్రీజను కోచ్ సోమ్నాథ్ ఘోష్తో పాటు రాష్ట్ర టీటీ సంఘం కార్యదర్శి నాగేందర్ రెడ్డి అభినందించారు. కాగా పురుషుల టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు రజతం కైవసం చేసుకుంది.