చెన్నై: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ పెద్ది రాహుల్ శ్రీవాస్తవ్.. గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా భారత్ తరఫున 74వ గ్రాండ్మాస్టర్గా నిలిచాడు. ఇటలీలో జరుగుతున్న కాటోలికా చెస్ ఫెస్టివల్ 8వ రౌండ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు జీఎం నార్మ్లు ఖాతాలో వేసుకున్న రాహుల్.. తాజా టోర్నీలో గ్రాండ్మాస్టర్ లెవాన్తో గేమ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా 2500 ఎలో రేటింగ్ను దాటాడు. టోర్నీ ఆరంభానికి ముందు 2468 రేటింగ్తో బరిలోకి దిగిన రాహుల్.. చక్కటి ప్రదర్శనతో గ్రాండ్ మాస్టర్ హోదాకు కావాల్సిన పాయింట్లను సాధించాడు. దేశం తరఫున 74వ గ్రాండ్మాస్టర్గా నిలిచిన శ్రీవాస్తవ్కు భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అభినందనలు తెలిపింది.
తెలంగాణ నుంచి నాలుగో జీఎం..
ఇటీవలి కాలంలో తెలంగాణ నుంచి యువ చెస్ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. రాష్ట్రం నుంచి అర్జున్ ఇరగైసి తొలి గ్రాండ్మాస్టర్గా నిలిస్తే.. ఆ తర్వాత హర్ష భరత్ కోటి, రాజా రిత్విక్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు రాహుల్ చేరికతో తెలంగాణ గ్రాండ్మాస్టర్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇదిలా ఉంటే ఎనిమిదో ఏటనే చెస్లోకి ప్రవేశించిన రాహుల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. గ్రీస్ టోర్నీ ద్వారా 2019లో తొలి జీఎం నార్మ్ అందుకున్న ఈ హైదరాబాదీ.. సెర్బియా, ఇటలీ, యూఏస్, కాటోలికా టోర్నీల ద్వారా 2500 ఎలో రేటింగ్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో జాతీయ, అంతర్జా తీయ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం స్పైకి ఎర్నెస్ట్ దగ్గర శిక్షణ పొందుతున్న రాహుల్.. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.