తెలంగాణ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ టైటిళ్లు కొల్లగొడుతున్నది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించిన శ్రీజ తాజాగా జాతీయ టీటీ చాంపియన్షిప్లో నాలుగు పతకాలతో తనకు తిరుగులేదని చాటిచెప్పింది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్ ఇలా బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లో పతకం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ల్లో ప్రత్యర్థులను కంగుతినిపిస్తూ పతకాలు కైవసం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించిన తొలి తెలుగు ప్లేయర్గా అరుదైన రికార్డు అందుకుంది. ఇదే జోరులో మే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ లక్ష్యమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. మెగాటోర్నీతో పాటు ఏషియన్ గేమ్స్, కోచింగ్, ఫిట్నెస్, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై శ్రీజతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ
టేబుల్ టెన్నిస్ యువ ప్లేయర్ ఆకుల శ్రీజ వరుస విజయాల హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పతకాలు సాధిస్తున్నది. గతేడాది జాతీయ చాంపియన్షిప్లో రెండు స్వర్ణ పతకాలతో మొదలైన శ్రీజ టాప్గేర్లో దూసుకెళుతున్నది. దిగ్గజ ప్యాడ్లర్ శరత్కమల్తో కలిసి ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో చరిత్ర లిఖించిన ఈ తెలంగాణ బిడ్డ..జమ్ము వేదికగా జరిగిన జాతీయ సీనియర్ టీటీ చాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు సహా కాంస్యంతో పతకాల పంట పండించింది.
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో విజేతగా నిలువడం చాలా సంతోషంగా ఉంది. జమ్ములో జరిగిన సీనియర్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్ దక్కించుకోవడం మరిచిపోలేని అనుభూతి. గర్వంగా ఫీలవుతున్నాను. నేషనల్ చాంపియన్షిప్ కంటే ముందు ఒకింత అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యాను. టోర్నీకి ముందు సింగపూర్ స్మాష్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరగడం నిరాశ పరిచింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వెంటనే తేరుకుని టోర్నీకి సిద్ధమయ్యాను. సింగిల్స్లో సుతీర్థ ముఖర్జీ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా వెనుకకు తగ్గలేదు. మ్యాచ్ మ్యాచ్కు పట్టు వదలకుండా పోరాడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.
జాతీయ చాంపియన్షిప్లో తీవ్రమైన పోటీ వాతావరణం ఉంది. ముఖ్యంగా సింగిల్స్లో తొలి రౌండ్ నుంచే ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాను. తొలి దశలో దివ్య దేశ్పాండే, క్వార్టర్స్లో యశస్వినితో హోరాహోరీగా తలపడ్డాను. ప్రతీ మ్యాచ్ను కీలకంగా భావించాను. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లలో ఇలా అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాను. ఎక్కడా అలసట దరిచేరనీయకుండా ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త తీసుకున్నాను.
డర్బన్ వేదికగా మే 20 నుంచి ప్రపంచ టీటీ చాంపియన్షిప్ మొదలవుతున్నది. ఇందుకోసం కొన్ని రోజుల తేడాతో పూర్తి స్థాయి ప్రణాళికతో సిద్ధం కాబోతున్నాను. మెగాటోర్నీ కోసం సన్నద్ధత కోసం విదేశాల్లో శిక్షణ తీసుకోవాలన్న ఆలోచన ఉంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం(టాప్స్) డెవలప్మెంట్ గ్రూపులో ఉండటం వలన విదేశాల్లో కోచింగ్ తీసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అయినా డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ముందుకెళుతాను. దాదాపు ప్రతీ టోర్నీకి వారు నాకు అండగా నిలుస్తున్నారు. ప్రపంచ టీటీ టోర్నీలో పతకం సాధించడం ద్వారా ర్యాంకింగ్ మెరుగుపర్చుకోవచ్చు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ అర్హతకు ర్యాంకింగ్స్ కీలకంగా మారుతాయి.
జాతీయ టీటీ అసోసియేషన్లో ఇటీవల కొత్త కార్యవర్గం కొలువు దీరింది. మాజీ ప్లేయర్లు అసోసియేషన్లో ఉండటం మాకు కలిసి వచ్చింది. ముఖ్యంగా కార్యదర్శి కమలేశ్ మెహతా, కోశాధికారి నాగేందర్రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారు. దీనికి తోడు కోచ్ సోమ్నాథ్ ఘోష్, ఫిట్నెస్ ట్రైనర్ హిరాక్ బాగ్చీ మద్దతు మరువలేనిది. ఆట పరంగా సోమ్నాథ్ శిక్షణలో రాటుదేలితే హిరాక్ నేతృత్వంలో ఫిట్నెస్ పరంగా మెరుగయ్యాను. రెండు రోజుల వ్యవధిలో పదిహేను మ్యాచ్లు ఆడటం దీనికి నిదర్శనం.
ఈ ఏడాది ఆఖర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఏషియన్ గేమ్స్లో పతక అవకాశాలకు ఢోకా లేదు. అయితే ఆతిథ్య చైనా, జపాన్, కొరియా ప్యాడర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.
కోచింగ్ విషయంలో ప్రభుత్వం మంచి తోడ్పాటు అందించింది. సోమ్నాథ్ఘోష్ను డిప్యూటేషన్ మీద సాట్స్ కోచ్గా నియమించడం కలిసొచ్చింది. ప్రస్తుతం ఆయన అకాడమీలో తర్ఫీదు పొందుతున్నాను. కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ గేమ్స్లో సాధించిన పతకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందాల్సి ఉంది. ఆర్థికంగా మద్దతు లభిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానన్న గట్టి నమ్మకం నాకుంది.