పనాజీ: గోవా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మహిళల 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసులో ఆస్తా చౌదరీ(2:19:29సె, అస్సాం), హషికా రామచంద్ర(2:22:20సె, కర్నాటక) వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకోగా, 2:22:28 టైమింగ్తో వ్రితి మూడో స్థానంలో నిలిచింది.
నేషనల్ గేమ్స్లో వ్రితికి ఇది మూడో పతకం. మరోవైపు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానీ, అభ్యా , సౌమ్య, అపూర్వతో కూడిన తెలంగాణ మహిళల టెన్నిస్ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ క్వార్టర్స్లో రష్మిక, శివానీ జోడీ 7-6(6), 3-3తో అంకితా రైనా, వైదేహి చౌదరీ ద్వయంపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ 12 పతకాలతో 22వ స్థానంలో కొనసాగుతున్నది.