మహబూబ్నగర్ టౌన్, మార్చి 14: త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీని మంత్రి.. కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్లో దాదాపు రూ.17 కోట్లకుపైగా నిధులతో క్రీడామైదానాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన మొదటి మ్యాచ్లో రంగారెడ్డి 58-13 తేడాతో ఆదిలాబాద్పై గెలిచి శుభారంభం చేసింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి.