తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ ప్రభుత్వం ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని ప్రశంసించారు.
తెలంగాణ పౌరుడిగా గర్వపడుతున్నా
‘ తెలంగాణ ప్రజలందరికి దశాబ్దిఉత్సవాల శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి అప్పుడే 10 ఏళ్లు గడిచిందా అనిపించింది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన.. చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. నువ్వు ఎక్కడి నుంచి అంటే తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో తెలంగాణ ఉంది. ఈ పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి అద్వితీయం..సూపర్స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తి హైదరాబాద్ మరో న్యూయార్క్ల ఉందని ప్రశంసించడం మరువలేనిది. ఈ విషయంలో నేను ఒక తెలంగాణ పౌరుడిగా, హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నాను. ఈ స్థాయి అభివృద్ధికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భవిష్యత్లో తెలంగాణ మరింత ప్రగతిపథంలో నడుస్తుందన్న నమ్మకం ఉంది. జై తెలంగాణ.
-విశ్వక్ సేన్
ప్రగతిపథంలో పయనిస్తున్నది
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తయ్యాయి. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నది. అద్భుతమైన అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సోదరసోదరీమణులకు నా శుభాకాంక్షలు.
-రామ్ చరణ్
మైలురాయిలా నిలిచిపోతాయి
ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ చరిత్రలో మైలురాయిలా నిలిచిపోతాయి. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ అద్భుత విజయాల్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తూ రాష్ట్ర సాధనలో వారి త్యాగాల్ని గుర్తుచేసుకుందాం. తెలంగాణ ప్రగతిలో మనందరం భాగస్వాములమవుదాం.
– సాయి ధరమ్ తేజ్