గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ – 2022 నేటి (ఆగస్టు 8) తో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు బర్మింగ్హామ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ అమ్మాయి, మహిళల బాక్సింగ్ 50 కిలోల ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన బాక్సర్ నిఖత్ జరీన్కు అరుదైన గౌరవం దక్కింది. ముగింపు వేడుకల కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని మోసే అవకాశాన్ని నిఖత్ దక్కించుకుంది.
నిఖత్తో పాటు టేబుల్ టెన్నిస్ వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్ కూడా జాతీయ పతాకాన్ని మోయనున్నాడు. ముగింపు వేడుకలలో నిఖత్, శరత్ భారత బృందానికి పతాకధారులు (Flagbearers)గా ఉంటారని భారత చీఫ్ డి మిషన్ రాజేష్ భండారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డబుల్ ఒలింపిక్ విన్నర్ పీవీ సింధు, హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్లు ఫ్లాగ్ బేరర్స్గా ఎంపికైన విషయం తెలిసిందే.
భారీ ఆశలతో ‘కామన్వెల్త్’కు అడుగుపెట్టిన భారత్ అనుకున్నదానికంటే మెరుగ్గానే రాణిస్తున్నది. భారత్ గతంలో పతకాలు సాధించని అథ్లెటిక్స్, లాన్ బౌల్స్ వంటి ఈవెంట్లలో స్వర్ణ పతకాలు నెగ్గింది. బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్లలో సత్తా చాటింది. ఇప్పటివరకు భారత్ 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తంగా 56 పతకాలు నెగ్గి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.