Asian Games | ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో భారత షూటర్ల పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. తమ గురికి తిరుగులేదని చాటిచెబుతూ షూటర్లు చైనా గడ్డపై భారత మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. చైనా, కొరియా, జపాన్ షూటర్ల దీటైన పోటీని తిప్పికొడుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత రికార్డులను తిరుగరాస్తూ ఇప్పటికే మన షూటర్లు 18 పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
అరంగేట్రం ఆసియాగేమ్స్లో తెలంగాణ ధృవతార ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. 10మీటర్ల ఎయిర్పిస్టల్ టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో ఇషా వెండి వెలుగులు విరబూసింది. బరిలోకి దిగేంత వరకే.. ఒకసారి పోటీ మొదలైతే పతకం పక్కా అన్న రీతిలో ఈ తెలంగాణ షూటర్ ఎదురన్నది లేకుండా దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదిగిన ఇషాసింగ్ షూటింగ్ రారాణిగా మన్ననలు అందుకుంటున్నది. పాలక్, దివ్యతో కలిసి రజతంతో మెరిసిన ఇషా..వ్యక్తిగత విభాగంలో మరో రజతాన్ని ముద్దాడింది. ఐశ్వరీప్రతాప్సింగ్, స్వప్నిల్, అఖిల్ రైఫిల్ విభాగంలో స్వర్ణం కొల్లగొట్టారు. అదే జోరు కొనసాగిస్తూ ప్రతాప్సింగ్ మరో రజతాన్ని ముద్దాడాడు.
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోమారు పంచ్ పవర్ చూపెట్టింది. జోర్డాన్ బాక్సర్ను మట్టికరిపిస్తూ సెమీస్లోకి దూసుకెళ్లి పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది. పురుషుల డబుల్స్లో సాకేత్మైనేని, రామ్కుమార్ వెండి పతకం కైవసం చేసుకోగా, ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కిరణ్ బలియాన్ షాట్పుట్లో కాంస్యంతో మెరిసింది. మహిళల స్కాష్ టీమ్ఈవెంట్లో భారత్కు కాంస్యం దక్కింది.
హాంగ్జౌ: ఆసియాగేమ్స్లో శుక్రవారం భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. రోజురోజుకు తమ పతక ప్రదర్శనకు మరింత మెరుగులు అద్దుకుంటూ పట్టికలో ముందంజ వేస్తున్నారు. తమకు బాగా అచ్చొచ్చిన షూటింగ్లో భారత షూటర్లు పతక గర్జన పూరించారు. పోటీల తొలి రోజు నుంచి మొదలుపెడితే శుక్రవారం వరకు భారత షూటర్ల తుపాకులు పతకాలతో గర్జిస్తూనే ఉన్నాయి. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ఈవెంట్లో భారత త్రయం ఇషాసింగ్, పాలక్ గులియా, తడిగోలు సుబ్బరాజు దివ్య 1731 స్కోరుతో రజతంతో మెరిసింది.
చైనా(1736), చైనీస్ తైపీ(1723)వరుసగా స్వర్ణ, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. పురుషుల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ఐశ్వరీ ప్రతాప్సింగ్, స్వప్నిల్ సురేశ్, అఖిల్ షెరాన్తో కూడిన భారత జట్టు ప్రపంచ రికార్డు స్కోరుతో 1769 పసిడి పతకాన్ని ముద్దాడింది. ఐశ్వరీ(591), స్వప్నిల్(591), షెరాన్(587) సూపర్ గురితో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. చైనా(1763), కొరియా(1748) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. చైనీస్ షూటర్లకు తిరుగులేని పోటీనిస్తూ భారత షూటర్లు చెక్కుచెదరని గురితో ఆకట్టుకున్నారు. మరోవైపు 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్ పోరులో ఐశ్వరీ ప్రతాప్సింగ్ 459.7 పాయింట్లతో రజతం ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విభాగంలో చైనా షూటర్లు డు లిన్షు(460), తియాన్ జిమింగ్(448)స్వర్ణం, కాంస్యం కైవసం చేసుకున్నారు. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పాలక్(242.1) పసిడితో మెరువగా, హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్(239.7) రెండో రజతాన్ని ముద్దాడింది.
ఆసియాగేమ్స్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ దూసుకెళుతున్నది. శుక్రవారం జరిగిన మహిళల 50కిలోల క్వార్టర్స్ పోరులో నిఖత్ జరీన్..జోర్డాన్ బాక్సర్ నాసర్ హనన్పై అద్భుత విజయం సాధించింది. నిఖత్ సంధించిన పవర్ఫుల్ పంచ్లకు ప్రత్యర్థి బాక్సర్ నిలువలేకపోవడంతో రిఫరీ తొలి రౌండ్లోనే ఆర్ఎస్సీ(రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) కింద విజేతగా ప్రకటించాడు. దీంతో అలవోకగా క్వార్టర్స్ గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టిన నిఖత్..బౌట్లో బెబ్బులిలా గర్జించింది. దీనికి తోడు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్కు భారత్ నుంచి నిఖత్ తొలి బెర్తు ఖరారు చేసుకుంది. సరిగ్గా నాలుగేండ్ల క్రితం టోక్యో(2020)ఒలింపిక్స్ కోసం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డ ఈ ఇందూరు బాక్సర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ గతేడాది కామన్వెల్త్ టైటిల్ దక్కించుకుంది. తాజాగా ఆసియాడ్లోనూ సెమీస్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది.
హైదరాబాద్: హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో ఇషా రెండు రజత పతకాలతో మెరిసింది. టోర్నీలో మొత్తంగా స్వర్ణం సహా మూడు రజతాలతో ఇషాసింగ్ చరిత్ర సృష్టించిందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆసియా క్రీడల్లో పతకాలు కొల్లగొట్టిన ఇషా..తెలంగాణ ఖ్యాతిని మరోమారు ఘనంగా చాటిచెప్పిందని ఆయన పేర్కొన్నారు.
భారత షాట్పుటర్ కిరణ్ బలియాన్ ఆసియా గేమ్స్లో చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమైన తొలిరోజే కాంస్య పతకంతో మెరిసింది. ఫైనల్లో ఆమె మూడో ప్రయత్నంలో షాట్పుట్ను 17.36 మీటర్ల దూరం విసిరింది. కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శనతో బలియాన్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం కొల్లగొట్టింది. దాంతో, 72 ఏళ్ల తర్వాత షాట్పుట్లో మెడల్ సాధించిన మహిళగా 24 ఏళ్ల బలియాన్ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు బర్బరా వెబ్స్టర్ మాత్రమే ఈ పోటీల్లో మెడల్ గెలిచింది. 1951లో ఢిల్లీలో జరిగిన ఆసియా గేమ్స్లో ఆమె కాంస్య పతకంతో సత్తా చాటింది.
ఆసియా గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో సింగపూర్ను 13-0తో చిత్తు చేసిన టీమ్ఇండియా ఈరోజు మలేషియాను వణికించింది. పూల్ ఏలో ఏకపక్షంగా సాగిన పోరులో 6-0తో అవలీలగా గెలుపొందింది. భారత ప్లేయర్లు మొదటి అర్థ భాగంలో ఏకంగా నాలుగు గోల్స్తో ఆధిపత్యం కనబరిచారు. మొనికా 7వ నిమిషంలో తొలి గోల్ అందించింది. ఆ తర్వాత వైస్ కెప్టెన్ దీప్ గ్రేస్ ఎక్కా(8వ నిమిషం), నవ్నీత్ కౌర్(11వ నిమిషం), వైష్ణవి విఠల్ ఫాల్కే(15వ నిమిషం), సంగీతా కుమారి(24వ నిమిషం)..లర్లేమ్సియామీ(50వ నిమిషం)లో గోల్స్ చేయడంతో భారత్ భారీ తేడాతో గెలిచింది.
18 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో ఇప్పటి వరకు భారత షూటర్లు గెలిచిన పతకాల సంఖ్య ఇది. ఇందులో ఆరు స్వర్ణాలు సహా ఏడు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. 2006 (దోహా)లో నమోదై 14 పతకాల రికార్డు తాజాగా చెరిగిపోయింది.
పోటీ మొదట్లో మంచి ఆరంభం లభించింది. లక్ష్యంపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు సాగడం కలిసొచ్చింది. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు మన గమనం దెబ్బతింటుంది. కానీ అలా ఏం జరుగలేదు. ఒకింత ఒత్తిడికి లోనైనా తిరిగి పుంజుకున్నాను. టెక్నికల్ విషయాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని నోట్ చేసుకుంటూ తిరిగి అలాంటి తప్పిదాలు జరుగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.
-ఇషా సింగ్
అథ్లెటిక్స్: పురుషుల లాంగ్జంప్
(శ్రీశంకర్, జెస్విన్)-ఉ: 6.15
పురుషుల 1500 హీట్స్(అజయ్కుమార్, జిన్సన్)-ఉ:7.00
మహిళల 400మీ ఫైనల్
(ఐశ్వర్య)-సా:5.30
పురుషుల 400మీ
ఫైనల్(అజ్మల్)-సా:5.40
పురుషుల 10,000 ఫైనల్-ఉ: 5.50
హాకీ: భారత్ X పాకిస్థాన్-సా: 6.15
బాక్సింగ్: పురుషుల 71కి క్వార్టర్స్
(నిశాంత్)-సా: 6.30