ఇవన్నీ చేసింది ఓ సగటు క్రికెట్ అభిమానైతే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ.. సంగీత ప్రపంచంలో సమున్నత శిఖరాలను అధిరోహించిన గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ అంటే ఆశ్చర్యం వేయక మానదు! సచిన్ టెండూల్కర్ వందో శతకం చేయాలని పూజలు చేసినా.. మహేంద్రసింగ్ ధోనీని రిటైర్ కావొద్దని కోరినా.. అది కేవలం లతా దీదీకే చెల్లింది! ఇప్పుడంటే దేశంలో బీసీసీఐని మించిన సంపన్న క్రీడాబోర్డు లేదు కానీ.. ఒకప్పుడు వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన జట్టు సభ్యులకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా బోర్డు వద్ద నిధులు లేని సమయంలో నేనున్నానంటూ ముందడుగు వేసి సంగీత విభావరి నిర్వహించిన గొప్ప మనసున్న లతా దీదీ ఆదివారం కన్నుమూశారు. క్రికెట్తో విడదీయరాని అనుబంధం ఉన్న లతాజీ మృతికి బీసీసీఐ మొదలు అన్నీ క్రీడా సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ వందో శతకం చేసిన రోజు అది తానే చేసినంతగా మురిసిపోయిన లతా దీదీ అంతిమ సంస్కారాలకు మాస్టర్ హాజరుకాగా.. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మిథాలీరాజ్, బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాకారులు సంతాపం తెలియజేశారు. తొలిసారి సచిన్ నోటి నుంచి ఆయి (అమ్మా) అన్న పదం విని కదిలిపోయిన లతా మంగేష్కర్.. ఆఖరి క్షణం వరకు మాస్టర్కు ఓ తల్లిలా అండగా నిలిచింది. క్రీడా రంగానికి సచిన్ చేసిన సేవలకు అతడికి భారతరత్న ఇవ్వడం సబబే అని బాహాటంగానే ప్రకటించిన లతా దీదీ.. ఓ కార్యక్రమంలో అతడి కోసం ప్రత్యేకంగా పాట పాడి పరవశింప చేసింది. భారత జట్టుకు లతాజీ అందించిన తోడ్పాటుకు దేశంలోనీ అన్ని క్రికెట్ స్టేడియాల్లో రెండు వీఐపీ టికెట్లను ఆమె కోసం ప్రత్యేకంగా కేటాయించిన బీసీసీఐ.. ఆమె సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొంది.