Team India tour SouthAfrica | సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీం ఇండియా టూర్పై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాక దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఏ) అధికారులతో చర్చిస్తామని ఆ వర్గాల కథనం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 17 నుంచి జనవరి 26 వరకు సౌతాఫ్రికాలో టీం ఇండియా పర్యటించాల్సి ఉంటుంది. ఈ టూర్లో సౌతాఫ్రికా జట్టుతో టీం ఇండియా జట్టు 3 టెస్ట్లు, మూడు వన్డేలు, 4 టీ-20 మ్యాచ్లు ఆడనున్నది.
ఇప్పుడు టీం ఇండియా న్యూజిలాండ్లో కివీస్తో టెస్ట్ సిరీస్లో పాల్గొంటున్నది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత వచ్చేనెల 8 లేదా 9వ తేదీన దక్షిణాఫ్రికాకు వెళ్లాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కానీ ఇప్పుడు సౌతాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో టీం ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా మ్యాచ్లు జరిగే జొహన్నెస్బర్గ్, సెంచూరియన్ సమీప ప్రిటోరియాల్లో కరోనా కేసులెక్కువగా ఉన్నాయి.
కివీస్తో టెస్ట్ సిరీస్ ముగియగానే టీం ఇండియా క్రికెటర్లు ముంబైకి వస్తారు. అక్కడి నుంచి నేరుగా చార్టర్డ్ ఫ్లయిట్లో జొహన్నెస్బర్గ్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా క్రికెటర్లు తప్పనిసరిగా 3-4 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. మ్యాచ్ల నిర్వహణపై దక్షిణాఫ్రికా క్రికెట్ నుంచి స్పష్టత వచ్చాకే వైఖరి తెలియజేయాలని బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తున్నది.