BCCI : ఈ రోజు ముంబైలోని బీసీసీఐ ఆఫీసులో జరిగిన భారత జట్టు సమీక్షా సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్, విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని మూడు కీలక ప్రతిపాదనలు వెలువరించింది. ఈ వివరాలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. అవేంటంటే.. భారత జట్టుకు ఎంపికకు అర్హత సాధించడం కోసం వర్థమాన ఆటగాళ్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఎక్కువ మ్యాచ్లు ఆడాలి. రెండోది.. ఆటగాళ్ల ఫిట్నెస్ తెలుసుకునేందుకు నిర్వహించే యోయో టెస్టు, ఎముకల బలాన్ని కొలిచే డెక్సా టెస్టులు ఇకపై ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో భాగం కానున్నాయి. మూడోది.. ఫ్రాంఛైజీలతో కలిసి జాతీయ క్రికెట్ అకాడమీ ఐపీఎల్లో ఆడే భారత ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని గమనించనుంది.
ఈ సమావేశంలో ఆటగాళ్లు అందుబాటులో ఉండడం, పనిభారం, వాళ్ల ఫిట్నెస్ ప్రమాణాల మీద కూడా బీసీసీఐ అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు వివీఎస్ లక్ష్మణ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది భారత్, శ్రీలంకతో మొదటి సిరీస్ ఆడనుంది. జనవరి 3న ముంబైలో మొదటి మ్యాచ్ జరగనుంది. చేతన్ శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే శ్రీలంక సిరీస్ కోసం వన్డే, టీ 20 జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ఓటమి, బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోవడంతో జట్టు కూర్పు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. జట్టులో మార్పులు అవసరమని మాజీ క్రికెటర్లు చాలామంది సూచించారు. దాంతో చేతన్ శర్మ కమిటీపై బీసీసీఐ నవంబర్లో వేటు వేసింది. కొత్త కమిటీ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెలలోనే కొత్త కమిటీ ఏర్పడనుంది