చివరి రోజు ఏదైనా అధ్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ
తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడింది. రెండు సెషన్లకు పైగా బౌలింగ్ చేసిన మనవాళ్లు రెండే వికెట్లే పడగొట్టడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయినా తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ 2-1తో వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ నెగ్గితేనే టీమ్ఇండియా నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధిస్తుందనుకుంటే.. మ్యాచ్ ముగియకముందే న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడటంతో రోహిత్సేనకు టికెట్ కన్ఫామ్ అయింది.
టెస్టు క్రికెట్ కష్టతరమైంది. ఐదు రోజుల ఫార్మాట్ ఆడటం అంత సులభం కాదు. సిరీస్ ఫలితంతో సంతృప్తిగా ఉన్నా. ట్రోఫీ నెగ్గేందుకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఢిల్లీ టెస్టు విజయం పట్ల గర్వంగా ఉంది. ఆ మ్యాచ్లో తొలుత వెనుకబడ్డ తర్వాత పుంజుకున్న
తీరు గొప్పది. -రోహిత్, భారత కెప్టెన్
చాన్నాళ్ల తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోరాడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు బాగా ఆడారు. తొలి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించగా.. గిల్, కోహ్లీ, అక్షర్ చక్కగా రాణించారు. న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ ఫలితంపైనా ఓ కన్నేసి ఉంచాం. లంచ్ విరామానికి ఫలితం వచ్చేసింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. -ద్రవిడ్, భారత కోచ్
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్ను టీమ్ఇండియా వరుసగా నాలుగోసారి కైవసం చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సోమవారం ముగిసిన ఆఖరి టెస్టు ‘డ్రా’ కాగా.. రోహిత్ సేన 2-1తో ట్రోఫీ చేజిక్కించుకుంది. దీంతో పాటు మ్యాచ్ ఫలితం తేలకముందే డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించింది. ఓవర్నైట్ స్కోరు 3/0తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 175/2 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్నస్ లబుషేన్ (213 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. చివరి రోజు కూడా పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించకపోగా.. బ్యాటర్లు స్వేచ్ఛగా ముందుకు సాగారు. భారత బౌలర్లలో అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఇరుజట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. టెస్టు ఫార్మాట్లో మూడేండ్ల తర్వాత సెంచరీ చేసిన రన్మెషీన్ విరాట్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్లో 25 వికెట్లతో పాటు 86 పరుగులు చేసిన స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించింది. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన చివరి పోరును ‘డ్రా’ చేసుకున్న రోహిత్ సేన ముందంజ వేసింది. క్రైస్ట్చర్చ్ టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపొందడంతో అహ్మదాబాద్ ఫలితంతో సంబంధం లేకుండా టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా 66.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. భారత్ (58.80 పాయింట్లు) రెండో స్థానంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా జరుగనున్న ఐసీసీ ప్రతిష్ఠాత్మక సమరంలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480, భారత్ తొలి ఇన్నింగ్స్: 571, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 175/2 డిక్లేర్డ్ (హెడ్ 90, లబుషేన్ 63 నాటౌట్; అక్షర్ 1/36).