ఈ టీ20 ప్రపంచకప్లో అతిపెద్ద సంచలనం జింబాబ్వే సృష్టించింది. బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించింది. దీంతో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. తను ఆడే మిగతా మూడు మ్యాచుల్లో గెలవడంతోపాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ కారణంగానే జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమిపై అభిమానులే కాదు ఆ దేశపు మాజీ ఆటగాళ్లు కూడా మండిపడుతున్నారు. పాక్ మాజీ స్టార్ పేసర్, రావల్ పిండి ఎక్స్ప్రెస్గా పేరొందిన షోయబ్ అక్తర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ‘ఇది చాలా డిసప్పాయింటింగ్ విషయం. నేను ఇంతకుముందే చెప్పాను.. పాకిస్తాన్ ఈ వారంలోనే స్వదేశానికి తిరిగొచ్చేస్తుందని. అందుకని భారత్ కూడా పెద్ద గొప్ప పరిస్థితిలో ఏం లేదు.
సెమీస్ ఆడి వచ్చే వారం ఆ జట్టు కూడా ఇంటికెళ్లిపోతుంది’ అని అక్తర్ అన్నాడు. పాక్ జట్టు సెలెక్షన్ను తప్పుబట్టిన అక్తర్.. అర్హత లేని ఆటగాళ్లను ఎంపిక చేశారని, అందువల్లనే పాక్ జట్టు ఇలాంటి అవమానకర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని చెప్పాడు. ‘భారత్ కూడా పెద్ద తీస్ మార్ ఖాన్ జట్టేం కాదు.
ఆ జట్టులో కూడా క్వాలిటీ లేదు. వాళ్లు కూడా వచ్చే వారం సెమీ ఫైనల్ ఆడి స్వదేశానికి తిరిగెళ్లిపోతారు’ అని తేల్చిచెప్పాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్లో రెండు మ్యాచులు ఆడిన భారత జట్టు రెండింట్లోనూ విజయం సాధించి, నాలుగు పాయింట్లతో గ్రూప్-బి టేబుల్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే.