శ్రీలంక పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచులను నెగ్గిన భారత జట్టు.. పల్లెకెల వేదికగా గురువారం జరిగిన చివరి వన్డేలోనూ విజయం సాధించింది. దాంతో సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 216 పరుగులకే కుప్పకూలింది. మిథాలీ రాజ్ నిష్క్రమణ తర్వాత వన్డే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హర్మన్ప్రీత్ కౌర్ తొలి విదేశీ సిరీస్ లోనే క్లీన్ స్వీప్ తో బోణీ కొట్టడం విశేషం.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. గత వన్డేలో అదరగొట్టిన స్మృతి మంధాన (6) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ షఫాలీ వర్మ (49), యస్తిక భాటియా (30) లు రాణించారు. ఈ ఇద్దరూ నిష్క్రమించాక హర్లీన్ డియోల్ (1) కూడా త్వరగానే ఔటైంది. కానీ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 75, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పూజా వస్త్రకార్ (65 బంతుల్లో 56, 3 సిక్సర్లు) లు కలిసి ఏడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ మెరగైన స్కోరు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక అమ్మాయిలలో ఓపెనర్ విష్మి గుణరత్నె (3) త్వరగానే నిష్క్రమించింది. కానీ కెప్టెన్ చమరి ఆటపట్టు (44), హాసిని పెరెరా (39), నీలాక్షి డిసిల్వ (48) లు రాణించారు. అయితే వీరి ఆట లంకకు విజయాన్ని చేకూర్చలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లంక 47.3 ఓవర్లలో 216 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, పూజా వస్త్రకార్ కు రెండేసి వికెట్లు దక్కాయి. దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, హర్లీన్ డియెల్ తలో వికెట్ తీశారు. హర్మన్ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.