WTC Points Table | టెస్టు ఫార్మాట్కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ముగియనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో నిలిచే తొలి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్గా నిలుస్తుంది. తొలి ఎడిషన్లో భారత్పై నెగ్గిన న్యూజిలాండ్ చాంపియన్గా నిలువగా.. ప్రస్తుతం 2021-2023 చాంపియన్ షిప్ సైకిల్ కొనసాగుతున్నది. వచ్చే ఏడాదిలో టెస్ట్ సైకిల్ ముగియనుండగా.. ఓవల్ స్టేడియంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది.
బంగ్లాతో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయం సాధించి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండోస్థానానికి ఎగబాకింది. మరోవైపు స్వదేశంలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా సైతం రెండు రోజుల్లోనే దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్కు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో భారత్కు కలిసివచ్చింది. చిట్టగాంగ్ టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది.
అలాగే ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్లకు ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నాలుగో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు 76.92 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు 55.77 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. దక్షిణాఫ్రికా 54.55 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. శ్రీలంక 53.33 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ 44.44 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. పాక్ 42.42 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ఇదిలా ఉండగా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్కు ముందు భారత జట్టు మరో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో మరో టెస్టుతో పాటు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్ల్లో గెలిస్తే టీమిండియా నేరుగా ఫైనల్కు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్కు నేరుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు ఈ టెస్టుల్లోనైనా టీమిండియా ఓడిపోతే ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా టెస్టు సిరీస్పైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అయితే, ఆస్ట్రేలియా జట్టు ఫామ్లో ఉన్నందున.. దక్షిణాఫ్రికాకు సవాల్లాంటిదే. ప్రొటీస్ జట్టును ఆసీస్ క్లీన్స్వీప్ చేయగలిగితే, భారత్ ఫైనల్ చేరడం సులువవుతుంది. దక్షిణాఫ్రికా ఒకటి రెండు టెస్టుల్లో గెలిచినా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఆస్ట్రేలియా తర్వాత దక్షిణాఫ్రికా తమ సొంత మైదానంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం దాదాపు ఖాగా.. రెండోస్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి.