Team India New Jersey | వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రాయ్పూర్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. టీమిండియా రైజింగ్ స్టార్ తిలక్ వర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. రాయ్పూర్కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఆడబోయే..‘ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2007లో తొలి ప్రపంచకప్ గెలిచాం. మళ్లీ కప్ను సాధించేందుకు 15 సంవత్సరాలకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఇది చాలా ఒడిదుడుకులతో కూడిన సుదీర్ఘ ప్రయాణం. కానీ, మళ్లీ ట్రోఫీ అందుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు భారత్లో ప్రపంచకప్ జరుగుతున్నందున ఇది ఉత్తేజకరమైన టోర్నీ అవుతుంది. భారత జట్టుకు ఎల్లప్పుడు నా శుభాకాంక్షలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇస్తారు. జట్టు కప్ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్ చెప్పాడు. ఈ జెర్సీలో భారత్ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువగా ముదురు నీలం రంగులో ఉండగా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగులో స్ట్రిప్స్ ఉంటుంది. కాలర్ దగ్గరలో తెలుపు రంగు ఉంది. జెర్సీ మధ్యలో టీమిండియా స్పాన్సర్ అపోలో టైర్స్, ఇండియా పేరు కనిపించేలా బీసీసీఐ జెర్సీని తీర్చిదిద్దింది. జెర్సీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్ను ఐసీసీ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న తొలి మ్యాచ్ జరుగనున్నది. ఈ సారి 20 జట్లు వరల్డ్ కప్లో తలపడబోతున్నాయి. ముంబయి వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్తో తన ప్రచారాన్ని మొదలుపెడుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతంది. అయితే, పాకిస్తాన్ ఫైనల్కు అర్హత సాధిస్తే శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో ఫైనల్ నిర్వహిస్తారు. ఇక 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు లీగ్ దశలో ఒకోసారి ఆడుతాయి. భారత్లో ముంబయి, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ ప్రపంచకప్కి ఆతిథ్యం ఇవ్వనుండగా.. శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలేలో మ్యాచులు జరుగనున్నాయి.