ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ప్రారంభానికి మరో 20 రోజులే ఉన్న నేపథ్యంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా.. మెగా టోర్నీకి ముందు మరో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది,ఆసీస్తో సిరీస్లో విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్, సూర్యకుమార్ బ్యాట్ పవర్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ మెరుపులు ఇలా.. రోహిత్ సేనకు మూడు అనుకూలతలు కనిపించగా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం, కేఎల్ రాహల్ నిలకడలేమి, ఫీల్డింగ్ తప్పిదాల రూపంలో మూడు ప్రతికూలతలు కూడా ఎదురయ్యాయి,మరి వరల్డ్కప్నకు ముందు మూడు మ్యాచ్లే ఆడనున్న టీమ్ఇండియా మూడు
లోపాలను సరిదిద్దుకుంటుందో చూడాలి.
ప్రపంచానికి పొట్టి ఫార్మాట్ పరిచయమైన తొలినాళ్లలో చాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా.. ఆ తర్వాత నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా రెండోసారి కప్పు చేజిక్కించుకోలేకపోయింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో మరీ ఘోరంగా నాకౌట్ దశకు చేరకుండానే వెనుదిరిగింది. ఆ తర్వాత నుంచి దృక్పథం మార్చుకున్న టీమ్ మేనేజ్మెంట్ దూకుడు మంత్రాన్ని పాటిస్తున్నది. ఈ మధ్య కాలంలో పేస్ బౌలింగ్ రాటుదేలడంతో భారత జట్టు వరుస సిరీస్లు సాధిస్తూ అలరించింది. అయితే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గైర్హాజరీలో ఆసియాకప్ బరిలోకి దిగిన టీమ్ఇండియా మరోసారి నిరాశ పరిచింది. ఆ తర్వాత ప్రపంచకప్నకు రిహర్సల్గా భావించిన ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమ్ఇండియా ఆకట్టుకుంది. మొహాలీలో ఓడినా.. నాగ్పూర్, హైదరాబాద్ మ్యాచ్ల్లో నెగ్గి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ద్వారా భారత్కు కొన్ని సమస్యలకు సమాధానాలు లభించగా.. మరికొన్ని కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అవేంటో క్లుప్తంగా చూద్దాం..
గత కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఇటీవల ఆసియాకప్లో సెంచరీ నమోదు చేసుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవడం టీమ్ఇండియాకు సానుకూలాంశం. ఉప్పల్లో జరిగిన మూడో టీ20లో విరాట్ తనలోని అత్యుత్తమ ఆటగాడిని మరోసారి ప్రపంచానికి చాటాడు. అవసరమైన సమయంలో వేగంగా ఆడటంతో పాటు.. అండగా నిలువాల్సిన సమయంలో సంయమనం పాటిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుత జట్టులో టీ20లకు అతికినట్లు సరిపోయే సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో 185 స్ట్రయిక్రేట్తో 115 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో కామెరున్ గ్రీన్ (118) ఒక్కడే సూర్యకుమార్ కంటే ముందున్నాడు. మైదానం నలువైపులా కండ్లుచెదిరే షాట్లు ఆడుతూ 360 డిగ్రీ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఇదే జోరు కొనసాగిస్తే మెగాటోర్నీలో
భారత్కు తిరుగుండదు.
గాయం నుంచి కోలుకుని ఐపీఎల్తో ప్రపంచానికి తనలోని కొత్త ఆటగాడిని పరిచయం చేసిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో బ్యాట్తో, బంతితో ఆకట్టుకున్నాడు. తొలి పోరులో టాపార్డర్ విఫలమైన చోట పాండ్యా వీరోచిత పోరాటాన్ని అభిమానులు ఇప్పుడప్పుడే మరువలేరు. బౌలింగ్లోనూ ప్రభావవంతమైన బంతులతో ఆకట్టుకున్న పాండ్యా.. ఆరో బౌలర్ కోటాను పూర్తి చేయగలననే భరోసానిచ్చాడు.
డెత్ ఓవర్స్ బౌలింగ్లో సమస్యలున్నాయని సిరీస్ అనంతరం రోహిత్శర్మ పేర్కొనగా.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ తేలిపోవడం మేనేజ్మెంట్ను కలవర పరుస్తున్నది.
స్టయిలిష్ ఆటగాడు కేఎల్ రాహుల్ నిలకడలేమి కూడా జట్టు యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నది. ఎన్నో రోజులుగా టాప్-3నే టీమ్ఇండియాకు మూలస్తంభాలు కాగా.. అప్పుడప్పుడు విలువైన ఇన్నింగ్స్లతో మెరుస్తున్న రాహుల్ నిలకడ కొనసాగించడంలో విఫలమవుతున్నాడు.
ఇక ఈ సిరీస్లో భారత ఫీల్డింగ్ మరీ నాసిరకంగా సాగింది. ఇటీవలి కాలంలో ఫీల్డింగ్లో మెరుగవుతూ వచ్చిన మన ఆటగాళ్లు.. కంగారూలతో సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు.