వరుణుడి అంతరాయం మధ్య సాగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. మొదట భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసిన భారత్.. ఆనక కట్టుదిట్టమైన బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం ముటగట్టుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్లో సీనియర్ బ్యాటర్ పుజారా తన విలువ చాటుకోగా.. అతడికి పంత్ చక్కటి సహకారం అందించాడు. సోమవారం తొలి ఇన్నింగ్స్లో ఎలా పోరాడుతుందనేదానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ లక్ష్యఛేదనలో అదుర్స్ అనిపిస్తున్న నేపథ్యంలో కనీసం నాలుగొందల పరుగులు ప్రత్యర్థి ముందుంచితే సిరీస్ భారత్ వశమైనట్లే!
బర్మింగ్హామ్: బౌలర్ల కృషికి బ్యాటర్ల సంయమనం తోడవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన దిశలో సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని 284 పరుగులకు ఆలౌట్ చేసింది. జానీ బెయిర్స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25), సామ్ బిల్లింగ్స్ (36) అతడికి సహకరించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ 4, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా టీమ్ఇండియాకు 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజరా (139 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (4), తెలుగు ఆటగాడు హనుమ విహారి (11), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యారు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ఓవరాల్గా 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారాతో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రిషబ్ పంత్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 84/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో రెండొందల పరుగులు జోడించి 284 వద్ద ఆలౌటైంది. సూపర్ ఫామ్లో ఉన్న జానీ బెయిర్స్టో సెంచరీతో కదం తొక్కగా.. బెన్స్టోక్స్, సామ్ బిల్లింగ్స్ తలా కొన్ని పరుగులు చేశారు. వర్షం కారణంగా వరుసగా మూడో రోజు కూడా మ్యాచ్కు అంతరాయం వాటిల్లగా.. కోహ్లీతో వాగ్వాదం అనంతరం బెయిర్స్టో రెచ్చిపోయి పరుగులు చేశాడు. షమీ వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదని బెయిర్స్టో.. సిరాజ్కు అదే శిక్ష వేశాడు.
ఈ క్రమంలో బెయిర్స్టో 81 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. బెన్ స్టోక్స్ను శార్దూల్ బుట్టలో వేసుకున్నాడు. బుమ్రా స్టన్నింగ్ క్యాచ్కు ఇంగ్లిష్ కెప్టెన్ పెవిలియన్ బాటపట్టాడు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని బెయిర్స్టో వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 119 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఎట్టకేలకు షమీ బౌలింగ్లో బెయిర్స్టో ఔట్ కాగా.. బ్రాడ్ (1)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆఖర్లో విలువైన పరుగులు చేసిన బిల్లింగ్స్, మాథ్యూ పాట్ (19)ను కూడా ఔట్ చేసిన సిరాజ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 416, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 (బెయిర్స్లో 106; సిరాజ్ 4/66, బుమ్రా 3/68), భారత్ రెండో ఇన్నింగ్స్: 125/3 (పుజారా 50, పంత్ 30; స్టోక్స్ 1/22).