ఈ ఏడాదంతా టీ20లతో బిజీ బీజీగా గడిపిన టీమ్ఇండియా.. ఇక వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్తో తొలి వన్డే ఆడనుంది. కోహ్లీ, రోహిత్, రాహుల్, హార్దిక్ గైర్హాజరీలో శిఖర్ ధవన్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న సూర్యకుమార్ యాదవ్పైనే అందరి దృష్టి నిలువనుంది.
ఆక్లాండ్: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. శుక్రవారం భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేలో తలపడనున్నాయి. పొట్టి ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఈ సిరీస్కు శిఖర్ ధవన్ను సారథిగా ఎంపిక చేశారు. రెండు రోజుల క్రితం ముగిసిన టీ20 సిరీస్లో యంగ్ఇండియా న్యూజిలాండ్పై 1-0తో సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పొట్టి ఫార్మాట్ సంగతి పక్కన పెడితే.. వన్డే క్రికెట్లో ప్రస్తుతం న్యూజిలాండ్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నది. గత పర్యటనలోనూ భారత జట్టు.. కివీస్పై టీ20 సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేసినా.. ఆ వెంటనే జరిగిన వన్డే సిరీస్లో 0-3తో వైట్ వాష్కు గురైన విషయం మర్చిపోవద్దు. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యంత ప్రమాదకర జైట్టెన న్యూజిలాండ్ను యువ ఆటగాళ్లతో నిండిన ధవన్ సేన ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే ఫార్మాట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధవన్తో పాటు శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనుండగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు రానున్నారు. టీ20 సిరీస్లో జట్టుకు కెప్టెన్సీ వహించిన హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు. అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ పేస్ భారాన్ని మోయనుండగా.. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లో ఒక్కరికే తుది జట్టులో చోటు దక్కనుంది. మరోవైపు విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్.. అలెన్, కాన్వే, లాథమ్, మిషెల్, ఫిలిప్స్, నీషమ్తో పటిష్ఠంగా కనిపిస్తున్నది. సొంతగడ్డపై సౌథీ, ఫెర్గూసన్, హెన్రీ బంతులు ఎదుర్కోవడం భారత యువ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే.
రగ్బీకి ప్రసిద్ధి గాంచిన ఆక్లాండ్ స్టేడియంలో స్ట్రయిట్ బౌండ్రీలు చిన్నవి. పేస్ కంటే స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపొచ్చు. వికెట్ల వెనుక వైపు ఎక్కువ షాట్లు ఆడే సూర్యకుమార్ యాదవ్ వంటి వారి ఆటతీరుకు ఈ మైదానం అనువైనది. ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మ్యాచ్కు వర్షం ముప్పులేదు.
భారత్: ధవన్ (కెప్టెన్), గిల్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, దీపక్, సుందర్, దీపక్ చాహర్, శార్దూల్, అర్ష్దీప్, చాహల్/కుల్దీప్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, కాన్వే, లాథమ్, మిషెల్, ఫిలిప్స్, నీషమ్, శాంట్నర్, సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్.