ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించింది. శ్రీలంకపై పొట్టి సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. ఇక వన్డే పోరుకు సిద్ధమైంది. టీ20 సిరీస్కు దూరమైన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టుతో చేరడంతో జట్టు బలంగా మారగా.. పొట్టి సిరీస్లో దీటైన పోటీనిచ్చిన లంక వన్డేల్లోనూ సత్తాచాటాలని తహతహలాడుతున్నది. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోగా.. భారత్ ఆడిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ బెంచ్కు పరిమితం కావాల్సిందేనని రోహిత్ పేర్కొన్నాడు. బ్యాటింగ్కు స్వర్గధామమైన గువాహటిలో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి!
గువాహటి: గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీలో జరిగిన పొట్టి సిరీస్ను 2-1తో చేజిక్కించుకున్న భారత్.. అదే ఊపులో వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 సిరీస్కు దూరమైన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ రాకతో భారత్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది. భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ సిరీస్ కోసం ఎంపిక చేసినా.. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టుకు దూరమైనట్లు రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. అప్పటి వరకు కోర్ టీమ్ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. వెన్నెముక గాయంతో ఇబ్బందిపడుతున్న బుమ్రా.. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న సిరీస్ వరకైనా అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా కనిపిస్తున్నది. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో రిస్క్ తీసుకోకూడదనే అతడికి విశ్రాంతి నిచ్చినట్లు రోహిత్ పేర్కొన్నాడు. బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు.
బుమ్రా గైర్హాజరీలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలు చూసుకోనుండగా.. టీమ్ఇండియా తరఫున గతేడాది అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ అతడికి అండగా నిలువనున్నాడు. మూడో పేసర్గా ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేస్తారా లేక అర్ష్దీప్కు అవకాశమిస్తారా చూడాలి. రవీంద్ర జడేజా గాయంతో జట్టుకు దూరమవడంతో స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లో ఒక్కరికే చాన్స్ ఉంది.
మిడిలార్డర్ ఎంపిక విషయంలో మేనేజ్మెంట్కు ప్రధాన సమస్య ఎదురుకానుంది. లంకతో చివరి టీ20లో విధ్వంసక బ్యాటింగ్తో శతక్కొట్టిన సూర్యకుమార్ యాదవ్తో పాటు శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లే కావడంతో జట్టు యాజమాన్యం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరం. బంగ్లాదేశ్తో జరిగిన పోరులో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కదని ఇప్పటికే రోహిత్ స్పష్టం చేయగా.. హిట్మ్యాన్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
మూడో స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు రానుండగా.. వికెట్ కీపర్గా లోకేశ్ రాహుల్ నాలుగో ప్లేస్లో బరిలోకి దిగనున్నాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బౌలింగ్, బ్యాటింగ్లో జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. అంతకుముందు భారత్ 15 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక విషయంలో ఒక స్పష్టత రావడానికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు పొట్టి సిరీస్లో జట్టును ముందుండి నడిపించిన లంక కెప్టెన్ దసున్ షనక వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, రాహుల్, సూర్యకుమార్/శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్/కుల్దీప్, సిరాజ్, షమీ, అర్ష్దీప్/ఉమ్రాన్.
శ్రీలంక: షనక (కెప్టెన్), మెండిస్, నిషాంక, అవిష్క, ధనంజయ, చరిత, హసరంగ, చమిక, తీక్షణ, రజిత, లహిరు కుమార.
పిచ్, వాతావరణం
గువాహటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుండగా.. చివరిసారిగా ఇక్కడ జరిగిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్లో పరుగుల వరద పారింది. మ్యాచ్కు వర్ష సూచనలేదు