చెన్నై: తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందడి నెలకొన్నది. చెన్నైలోని ఒక వంతెనకు చెస్ బోర్డ్ మాదిరిగా పెయింట్ వేశారు. 44వ ఎఫ్ఐడీఈ చెస్ ఒలింపియాడ్ జూలై 28న మహాబలిపురంలో ప్రారంభం కానున్నది. సుమారు వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి భారత్లో ఇది జరుగుతున్నది. 188 దేశాలకు చెందిన 2,000కు పైగా చెస్ క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆగస్ట్ పది వరకు ఇది కొనసాగుతుంది.
కాగా, చెస్ ఒలింపియాడ్కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో తొలి టార్చ్ రిలేని ప్రధాని మోదీ గత నెలలో జెండా ఊపి ప్రారంభించారు. ‘చెస్ ఒలింపియాడ్ తొలి టార్చ్ రిలే భారతదేశం నుంచి ప్రారంభమైంది. ఈ పెద్ద ఈవెంట్ను భారత్ నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి’ అని అన్నారు. దేశంలో పుట్టిన చదరంగం ప్రపంచం నలు మూలాల వ్యాపించడం మనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. దాని జన్మ స్థలానికి చెస్ తిరిగి రావడం, ఒలింపియాడ్ రూపంలో దాని విజయాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రముఖ నటుడు, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ చెస్ ఒలింపియాడ్ ప్రోమో వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
మరోవైపు చెస్ ఒలింపియాడ్ నేపథ్యంలో చెన్నైలోని నేపియర్ వంతెనకు చెస్ బోర్డ్ మాదిరిగా తెలుపు, నలుపు గడులతో పెయింట్ వేశారు. కారులో వెళ్తూ రికార్డ్ చేసిన వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘భారత దేశ చెస్ రాజధాని చెన్నై. గ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఐకానిక్ నేపియర్ బ్రిడ్జీ చెస్ బోర్డులా అలంకరించబడింది’ అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. అద్భుతం, క్రీడా స్ఫూర్తి, గ్రాఫిక్స్ ప్రపంచలా ఉంది అని కొందరు కొనియాడారు. అయితే వాహనాల డ్రైవింగ్కు ఇది ప్రమాదకరమని కొందరు విమర్శించారు. డ్రైవర్ల దృష్టిని మళ్లించేలా ఉన్న ఈ చెస్ బోర్డ్ పెయింటింగ్కు ఎవరు అనుమతించారంటూ ఒకరు ప్రశ్నించారు.
Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU
— Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022
#ChessChennai2022 pic.twitter.com/tiZeCN0a5v
— Rajinikanth (@rajinikanth) July 15, 2022