పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో భారతజట్టు ఆడట్లేదు. కానీ, భారతసంతతి అమ్మాయి తన పాటతో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని హోరెత్తించనుంది. రేపు జరగబోయే టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత సంతతికి చెందిన పదమూడేళ్ల జానకి ఈశ్వర్ ప్రదర్శన ఇవ్వనుంది. ఆస్ట్రేలియా రాక్ బ్యాండ్ ‘ఐస్హౌస్’తో కలిసి ఆమె పాటలు పాడనుంది. పోయిన ఏడాది ది వాయిస్ ఆస్ట్రేలియా మ్యూజిక్ రియాలిటీ షోలో పాల్గొన్న చిన్నవయస్కురాలిగా జానకి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో, వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్లో ఆమెకు అవకాశం వచ్చింది.
‘మెల్బోర్న్ స్టేడియంలో ప్రేక్షకుల ముందు పాట పాడడం, ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో కనిపించడం అనేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. టీవీ షోల్లో భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం వల్లనే ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నా. మా అమ్మానాన్న ఇద్దరూ క్రికెట్ ఫ్యాన్స్. ఫైనల్ మ్యాచ్కి ముందు జరగనున్న నా ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతజట్టు ఫైనల్కు చేరి ఉంటే బాగుండేది’ అని జానకి చెప్పింది.
సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం
జానకి తల్లిదండ్రుల పేర్లు అనూప్ దివాకరణ్, దివ్య రవీంద్రన్. కేరళలోని కొజికోడ్కు చెందిన వీళ్లది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఆరేళ్ల వయసులోనే జానకికి కర్నాటక సంగీతం నేర్పించారు. వీళ్లు 15 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మెల్బోర్న్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.