T20 World Cup | ఆఫ్ఘనిస్థాన్పై న్యూజిల్యాండ్ జట్టు ఘనవిజయం తర్వాత ఈ టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ చేరే దారులు పూర్తిగా మూసుకుపోయాయి. సోమవారం నమీబియాతో జరిగే నామమాత్రపు మ్యాచ్ తర్వాత నిరుత్సాహంగా టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది.
ఈ క్రమంలో ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ప్రపంచకప్లలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది ఒకటని చోప్రా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ టాస్ ఓడిన మాట నిజమేనన్న అతను.. కేవలం టాస్ ఓడితేనే మ్యాచ్లు ఓడిపోతారా? అని ప్రశ్నించాడు.
షార్జాలో ఇంగ్లండ్పై టాస్ ఓడినా కూడా సౌతాఫ్రికా గెలవలేదా? అన్నాడు. ఓడిన రెండు మ్యాచుల్లో మంచు కారణంగా భారత బౌలర్లు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని, కానీ ఆ మ్యాచుల్లో టీమిండియా బ్యాట్స్మెన్ రాణించకపోవడమే అసలు సమస్య అని చెప్పాడు.
బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు చేసి ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి ఉండేదని తెలిపాడు. ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన చోప్రా.. ఇది కోహ్లీ కెరీర్లోనే అత్యంత నిరాశాజనక టోర్నీగా అభివర్ణించాడు.
2007 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒకటి రెండు సార్లు టీమిండియా సెమీస్ వరకూ వెళ్లలేదని, కానీ గడిచిన 7-8 సంవత్సరాల్లో ఎప్పుడూ అలా జరగలేదని గుర్తుచేశాడు. అలాంటిది ఇప్పుడు సెమీస్ చేరకుండా వెనుతిరగడం టీమిండియా జట్టును చాలా బాధిస్తుందని పేర్కొన్నాడు.