ప్రస్తుతం భారత క్రికెట్లో అందరి నోటా వినిపిస్తున్న పేరు దినేష్ కార్తీక్. ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టులో పునరాగమనం చేశాడు. విమర్శకులకు తన బ్యాటుతో సమాధానం చెప్తూ వచ్చే టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్లో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.
అయితే కోహ్లీ, రాహుల్, రోహిత్ అందరూ వచ్చిన తర్వాత ప్రపంచకప్ జట్టులో డీకేకు చోటు దక్కకపోవచ్చని గంభీర్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అతన్ని ఎంపిక చేసినా ఆడించకపోతే ఉపయోగం ఏంటని? కాబట్టి అతనికి ఆ జట్టులో చోటు దక్కకపోవచ్చని గంభీర్ అన్నాడు. ఈ మాటలపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
గంభీర్ పేరు ప్రస్తావించలేదు కానీ.. భారత్కు కావలసిన ఆటగాడు డీకేనే అవ్వొచ్చు కదా? అంటూ చురకలేశాడు. ‘‘అతను ఆడనప్పుడు అసలు జట్టులో ఉంచడం దేనికి? అని కొందరు అడుగుతున్నారు. అసలు తను ఆడడని మీకెలా తెలుసు? భారత్కు అతనే అవసరమేమో? ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో అతను ఎంత ఫామ్లో ఉన్నాడనేది ముఖ్యం కానీ.. పేరు ప్రఖ్యాతులు కాదు’’ అని గవాస్కర్ విమర్శలు చేశాడు.
డీకే వయసును చూడొద్దని, అత్యవసర సమయాల్లో అతను ఎంత విలువైన పరుగులు చేస్తున్నాడో చూడాలని లిటిల్ మాస్టర్ చెప్పాడు. అసలు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ సమయంలో కూడా డీకే అందుబాటులో ఉండే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి అవన్నీ పక్కనపెట్టినా కూడా.. కేవలం డీకే వయసు చూడొద్దని, అతని పెర్ఫామెన్స్ చూడాలని సూచించాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో క్లిష్టమైన పిచ్పై అద్భుతమైన బ్యాటింగ్తో అర్థశతకం సాధించిన డీకే.. అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే.