న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఘోరమైన పరాభవాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది దాడులు చేస్తున్నారు. పాకిస్థాన్ చేతిలో పరాజయం తర్వాత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు.. న్యూజిల్యాండ్ చేతిలో కూడా టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేయడం ప్రారంభించారు.
అతనితోపాటు కోహ్లీ భార్య అనుష్క శర్మ, 9 నెలల కుమార్తె వామికపై కూడా అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఆ పాప ఫొటోల కోసం ఎదురు చూస్తున్నామని, అవి బయటపడినతర్వాత ఆ పాపపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు. వీటిపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది. ఈ బెదిరింపులను సుమోటోగా తీసుకుంది.
ఈ బెదిరింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, గుర్తించిన నిందితులు, వారిలో అరెస్టయిన వారి వివరాలు కూడా అందించాలని డిప్యూటీ కమిషనర్ను కోరింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలను వివరిస్తూ నవంబరు 8లోగా నివేదిక సమర్పించాలని తెలిపింది.