T20 World Cup | టీ20 ప్రపంచకప్ పుణ్యమా అని మరో క్రికెటర్ సోషల్ మీడియా దాడికి గురయ్యాడు. మొన్నామధ్య పాక్ చేతిలో టీమిండియా ఓడితే మహమ్మద్ షమీపై విపరీతమైన దూషణలు వచ్చిన సంగతి తెలిసిందే. అతనికి అండగా ఉంటామని చెప్పడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా ట్రోలింగ్ జరిగింది.
ఒక నీచుడు ఏకంగా కోహ్లీ 9 నెలల కుమార్తెను బలాత్కరిస్తానంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు పాక్ బౌలర్ హసన్ అలీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ టీ20 ప్రపంచకప్లో పాక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే సెమీస్ చేరింది. అజేయంగా వచ్చిన ఈ జట్టు సెమీఫైనల్లో తొలి ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ చివర్లో మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 41) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. అయితే అతనికి ఈ అవకాశం ఇచ్చాడంటూ పాక్ ప్లేయర్ హసన్ అలీపై పాక్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ 19వ ఓవర్ మూడో బంతికి వేడ్ భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ సరిగ్గా బంతిని టైమ్ చేయలేకపోయాడు.
చదవండి : పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
దీంతో బంతి బౌండరీ దాటలేదు. గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ పట్టేందుకు పాక్ బౌలర్ హసన్ అలీ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. అయితే అతను కూడా బంతిని అంచనా వేయడంలో పొరపడ్డాడు. దీంతో అతను ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను సిక్సర్లుగా మలిచి ఆసీస్కు మరపురాని విజయాన్నందించాడు వేడ్.
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. హసన్ అలీ జారవిడిచిన ఆ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పిందని, అతను దాన్ని అందుకొని ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
ఈ క్యాచ్ జార విడిచిన హసన్ అలీ బౌలింగ్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హసన్ అలీపై పాక్ అభిమానులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను పాకిస్థాన్లో అడుగుపెట్టగానే కాల్చి పారేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.