T20 World Cup | గడిచిన ఎనిమిదేళ్లలో తొలిసారిగా ఒక ఐసీసీ ఈవెంట్ సెమీస్ చేరకుండా భారత్ తిరుగుముఖం పట్టింది. ఈ టీ20 ప్రపంచకప్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటి దారిపట్టింది. ఈ క్రమంలో లెజెండరీ ఆల్రౌండర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు.
సరే ఈ వరల్డ్ కప్ అయిపోయింది కదా, వచ్చే వరల్డ్ కప్ చూసుకుందాం అనే ధోరణిలో బీసీసీఐ ఉండొద్దని కపిల్ సూచించాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలని చెప్పాడు. ఇది భవిష్యత్తు కోసం చూడాల్సిన తరుణమని, ఒక్క ప్రపంచకప్ పోతే భారత క్రికెట్ మొత్తం ముగిసినట్లు కాదని ధైర్యం చెప్పిన కపిల్.. కొందరు ఆటగాళ్ల ప్రవర్తనపై విమర్శలు సంధించాడు.
కొందరు ప్లేయర్స్ భారత జట్టుకు ఆడటం కన్నా ఐపీఎల్ ఆడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టాలని కపిల్ సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ ఆడొద్దని తను చెప్పడం లేదని, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ జట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని చెప్పాడు.
అలాగే ఈ ప్రపంచకప్లో చేసిన తప్పులే మళ్లీ చేయకపోవడమే మనం నేర్చుకునే అతిపెద్ద గుణపాఠమని, ఇప్పుడు క్రికెట్ను మరింత మెరుగ్గా మార్చాల్సిన బాధ్యత బీసీసీఐ భుజాలపై ఉందని పేర్కొన్నాడు.