మెల్బోర్న్: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాటర్ నిలిచాడు. ఆదివారం టీ20 వరల్డ్కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేయడం ద్వారా ఆరో స్థానంలో ఉన్న లెజెండరీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ను దాటేశాడు. దాంతో ద్రవిడ్ స్కోరు ఏడో స్థానానికి పడిపోయింది.
విరాట్ కోహ్లీ మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 53.80 సగటుతో 24,212 పరుగులు చేశాడు. అందులో 71 సెంచరీలు, 126 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. ఇక ద్రావిడ్ మొత్తం 509 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో 45.41 సగటుతో 24,208 పరుగులు చేశాడు. అందులో 48 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 270 పరుగులు.
ఇక అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 34,357 పరుగులతో టాప్ ప్లేస్లో ఉండగా.. శ్రీలంక కీపర్-బ్యాటర్ కుమార సంగక్కర (28,016), ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ (27,483), శ్రీలంకకు చెందిన మరో బ్యాటర్ మహేల జయవర్దనే (25,957), దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ (25,534) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.