ఇటీవల ముగిసిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్లో వీళ్లిద్దరి ర్యాంకులు మెరుగయ్యాయి. తొలి టీ20లో భారత జట్టు 93/4తో కష్టాల్లో ఉన్నప్పుడు బరిలో దిగిన ఈ జంట.. విండీస్ బౌలర్లపై విరుచుకుపడింది. 45 బంతుల్లో 65 పరుగులు కావలసిన స్థితిలో మరో ఓవర్పైగా మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది.
అలాగే మూడో టీ20లో ఈ జోడీ కేవలం 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు 184/5 పరుగుల స్కోరు అందించింది. దీనిలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 31 బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగగా.. వెంకటేశ్ అయ్యర్ కూడా 19 బంతుల్లోనే 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో తాజా టీ20 ర్యాంకింగ్స్లో వీరి స్థానాలు మెరుగయ్యాయి. వెంకటేశ్ అయ్యర్ అయితే ఏకంగా 203 స్థానాలు మెరుగుపరుచుకొని 115వ ర్యాంకులో నిలిచాడు. సూర్యకుమార్ కూడా 35 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.
ఈ సిరీస్లో పోరాడిన విండీస్ వీరుడు నికోలస్ పూరన్ కూడా ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని 13వ ర్యాంకులో నిలిచాడు. శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీసులో రాణించిన ఆసీస్ బౌలర్ ఆష్టన్ అగర్ కూడా టాప్-10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతను 9వ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ కూడా 12 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకులో నిలిచాడు. ఒమన్ జట్టు కెప్టెన్ జీషన్ మక్సూద్ కూడా ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్లలో రాణించాడు. దీంతో టాప్ టెన్ ఆల్రౌండర్లలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు.