దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో రికార్డులు బద్దలు కొడుతూ సంచలనం సృష్టిస్తున్న సూర్యకుమార్ ఇంగ్లండ్కు చెందిన సామ్ కరన్, పాకిస్థాన్ కీపర్,బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజాతో పోటీపడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘స్కై(ఎస్కేవై)’గా ప్రసిద్ధుడైన 32 ఏండ్ల సూర్యకుమార్ ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్లో వెయ్యి పరుగులు సాధించిన ఘనతను అందుకున్నాడు. గత ఏడాది సూర్య 187.43 స్ట్రైక్ రేట్తో 1164 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఏడాది కాలంలో 68 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా కూడా రికార్డు సాధించాడు.
గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో కూడా సూర్య ఆరు మ్యాచ్ల్లో మూడు అర్ధసెంచరీలతో తనదైన ముద్ర వేశాడు. అంతేగాక పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంక్ను కూడా దక్కించుకున్నాడు. మరోవైపు భారత మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఎమర్జింగ్ మహిళా క్రికెటర్ అవార్డును గెలుచుకున్నది. గత యేడాది 29 పరిమిత ఓవర్ల మ్యాచ్లలో 26 ఏండ్ల రేణుక 40 వికెట్లు దక్కించుకుని లెజెండరీ క్రికెటర్ జులన్ గోస్వామి లేని లోటును తీరుస్తున్నది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియాకప్నూ చక్కని ప్రతిభను ప్రదర్శించింది. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల రేణుక భవిష్యత్తులో భారత జట్టులో కీలక బౌలర్గా మారుతుంది అనడంలో సందేహం లేదు.