కొలంబో: ఇండియన్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) ఇంగ్లండ్లో ఉన్న ఇండియన్ టెస్ట్ టీమ్తో చేరడానికి బయలుదేరాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్ అకౌంట్లో చెప్పాడు. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతున్న ఫొటోను అతడు పోస్ట్ చేస్తూ.. నెక్ట్స్ స్టాప్ ఇంగ్లండ్ అని కామెంట్ చేశాడు. ఇంగ్లండ్లో ఉన్న టెస్ట్ టీమ్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకలో ఉన్న టీమ్ నుంచి సూర్యకుమార్ యాదవ్, పృథ్వి షాను ఇంగ్లండ్ పంపాల్సిందిగా కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి బోర్డును అడిగారు.
వాళ్లు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో కృనాల్ పాండ్యాకు కొవిడ్ సోకడం, వీళ్లు అతనితో సన్నిహితంగా ఉండటంతో ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. దీంతో తొలి టెస్ట్ కంటే ముందే వీళ్లు అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. ఇప్పుడు ఆలస్యమైంది. బుధవారం ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ మూడో టెస్ట్ సమయానికి టీమ్ సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నారు.