దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 ర్యాంకింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకర్ బాబర్ ఆజమ్(పాకిస్థాన్) కంటే కేవలం రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. మూడో టీ20లో సూర్యకుమార్ 44 బంతుల్లోనే 76 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అంతేగాక వెస్టిండీస్ గడ్డపై టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. వెస్టిండీస్తో అయిదు మ్యాచ్ల సిరీస్లో సూర్యకుమార్ ఇప్పటివరకు 111 పరుగులు సాధించాడు. ఇప్పట్లో పాకిస్థాన్కు టీ20 మ్యాచ్లు లేనందున సూర్యకుమార్ విండీస్తో సిరీస్ ముగిసే సమయానికి టాప్ ర్యాంక్కు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వికెట్కీపర్ రిషభ్ పంత్కూడా ర్యాంకింగ్స్లో ముందంజ వేసి 66వ ర్యాంకు ఎగబాకాడు. వన్డే విభాగంలో భారత ఓపెనర్ శిఖర్ ధవన్, బౌలర్లలో చాహల్ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకున్నారు.