చెన్నై: ఇండియా టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో కామెంట్రీ ఇస్తున్న రైనా అక్కడి సంస్కృతి గురించి మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్తో ఉన్న రైనాను సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. నేను కూడా బ్రాహ్మిణ్నే అని అనుకుంటున్నాను. నేను 2004 నుంచి చెన్నైలో ఆడుతున్నాను. ఇక్కడి సంస్కృతి నాకు ఇష్టం. నా టీమ్ మేట్స్ అంటే కూడా. నేను అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను అని రైనా అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్లోనూ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. మాకు మంచి స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడి సంస్కృతి నాకు చాలా బాగా నచ్చుతుంది. సీఎస్కే టీమ్లో భాగం కావడం సంతోషంగా ఉంది అని రైనా చెప్పాడు. అయితే అతని కామెంట్స్పై సోషల్ మీడియా తీవ్రంగా మండిపడింది. చెన్నై అంటే బ్రాహ్మిణ్లేనా అంటూ నెటిజన్లు అతన్ని ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నా.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు అంటూ ఓ ట్విటర్ యూజర్ కామెంట్ చేశాడు.