Suresh Raina : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే… ఈసారి అందరి కళ్లు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మీదే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సారథికి ఇదే ఆఖరి ఐపీఎల్ అనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ గురించి మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఫిట్గా కనిపిస్తున్నాడని, అతను వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ ఆడతాడని అతను అన్నాడు.
‘ధోనీ నెట్స్లో చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతేకాదు అతను ఫిట్గా కనిపిస్తున్నాడు. అయితే.. ఈసారి మహీ ఎలా ఆడనున్నాడు అనేది ఆసక్తికరంగా ఉండనుంది. అంతేకాదు.. ఈ ఐపీఎల్ ధోనీ, అంబటి రాయుడుకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్లు ఏడాది కాలంగా ఎలాంటి టోర్నమెంట్లు ఆడలేదు’ అని ఈ మాజీ ఆల్రౌండర్ అన్నాడు.
ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన రైనా ఆల్రౌండర్గా, ఫినిషర్గా టీమిండియా ఎన్నో విజయాల్లో భాగం అయ్యాడు. 2011 వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అతను సభ్యుడు. ధోనీ కెప్టెన్సీలో సురేశ్ రైనా మరింతగా రాణించాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా. అంతేకాదు ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలికిన అరగంటలోనే రైనా ఆటకు అల్విదా చెప్పాడు. వీళ్లిద్దరూ 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. ఐపీఎల్లో ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడరు. ప్రస్తుతం రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడుతున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చైన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ ఏడాది ప్రతి టీమ్ సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది. అంతేకాదు ప్రతి జట్టుకు ఇంప్యాక్ట్ ప్లేయర్ను తీసుకునే అవకాశం ఉంది. దాంతో, ఈ సీజన్ సరికొత్తగా ఉండనుంది. గత సీజన్లో పెద్దగా రాణించని సీఎస్కే ఈ సారి సత్తా చాటుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.