క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురి అరెస్ట్ ..
రూ.1.50 లక్షల నగదు స్వాధీనం
డ్రీమ్ ఎక్సేంజ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు పందెం రాయుళ్లను రాచకొండ భువనగిరి ఎస్వోటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లిఫ్ట్ మెకానిక్గా పని చేస్తున్న శివకుమార్రెడ్డి, కారు డెకరేటర్ ఆకుల రమేశ్ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఐపీఎల్ మ్యాచ్ల్లో బెట్టింగ్ కాయాలని స్కెచ్ వేశారు. ఇందుకోసం డ్రీమ్ ఎక్సేంజ్ యాప్ను ఎంచుకున్నారు. పందెం కాస్తే రెట్టింపు నగదు ఇస్తామని ప్రచారం చేసి స్నేహితులకు ఆశ పుట్టించారు. శుక్రవారం జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్పై బాల్ టూ బాల్, ఆటగాడి వ్యక్తిగత స్కోరు, టాస్ విన్నింగ్, మ్యాచ్ విన్నింగ్, బౌండరీలు, వికెట్ల మీద పందెం నిర్వహించగా చాలా మంది పాల్గొన్నారు. ఈ బెట్టింగ్లపై భువనగిరి ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందగా.. శుక్రవారం రాత్రి సోదాలు జరిపారు. నిర్వాహకులతో పాటు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వాట్సాప్ నెంబర్ 9490617111 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కోరారు.