చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ జట్టు ఎట్టకేలకు గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మొదట పంజాబ్ 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. జానీ బెయిర్స్టో(63 నాటౌట్: 56 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అజేయ అర్ధశతకానికి తోడు డేవిడ్ వార్నర్(37: 37 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) రాణించడంతో రైజర్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన విలియమ్సన్(16 నాటౌట్: 19 బంతుల్లో) ఛేదనలో బెయిర్స్టోకు అండగా నిలిచాడు. నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్కు ఇది మూడో ఓటమి. ఛేదనకు కష్టంగా మారిన పిచ్పై ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారు. సాధించాల్సిన రన్రేట్ తక్కువగా ఉండటంతో బెయిర్స్టో ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 120 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ 2021లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే. ఆరంభంలో మయాంక్ అగర్వాల్(22: 25 బంతుల్లో 2ఫోర్లు), చివర్లో షారుక్ ఖాన్(22: 17 బంతుల్లో 2సిక్సర్లు) కాసేపు నిలవడంతో ఆమాత్రం స్కోరైనా సాధించింది. కేఎల్ రాహుల్(4), క్రిస్గేల్(15), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(13), హెన్రిక్స్(14) విఫలమయ్యారు. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీసిన రైజర్స్ బౌలర్లు కింగ్స్ను కోలుకోనీయలేదు.
హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. మధ్య ఓవర్లలో కింగ్స్ బ్యాట్స్మెన్ను వణికించాడు. పరుగులు రాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. యువ క్రికెటర్ అభిషేక్ కూడా కళ్లుచెదిరే బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు.